సార్వత్రిక ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయంలో జిల్లాలో 1168 పోలింగ్ కేంద్రాలు ఉండగా దానిని 1201కు పెంచింది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,63,377 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రాల్లో అందుకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు.
సూర్యాపేట, నవంబర్ 5 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను సైతం ఓటర్ల జాబితాకు అనుగుణంగా పెంచడం జరిగింది. 2018 ఎన్నికల సమయంలో 1,168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ ఎన్నికల నాటికి మరో 33 పెంచి 1,201 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ నియోజక వర్గాలు సూర్యాపేట జిల్లాలో ఉండగా తుంగతుర్తి నియోజక వర్గంలోని ఆరు మండలాలు సూర్యాపేట, రెండు మండలాలు యాదాద్రి భువనగిరి, ఒక మండలం నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నది.
నాలుగు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 9,63,377 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సుమారు 1,100 మందికంటే తక్కువగా ఉండే విధంగా పోలింగ్ కేంద్రాల ప్రక్షాళన చేయడం జరిగింది. గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు 1,200 నుంచి 1,450 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేవారు. అయితే ఆ సంఖ్యను తగ్గించాలని భావించిన ఎన్నికల సంఘం 900 నుంచి 1,100 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేసింది. గతంలో ఒక గ్రామం ఓట్లు మరో గ్రామంలో ఉండేవి. వారు ఓటు వేయడానికి వ్యయప్రయాసాలు ఎదుర్కొనేవారు. అయితే ఈసారి మెరుగైన వసతుల కల్పనతో ఓటింగ్ శాతం సైతం పెరుగనున్నదని అంచనా వేస్తున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌళిక వసతుల లేక ఓటర్లు ఇబ్బందులు పడేవారు. కనీసం తాగునీరు కూడా ఉండేది కాదు. ఓటు వేసే వరకు ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈసారి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులతో కలిసి మౌళిక వసతుల కోసం ప్రత్యేకంగా కమిటీ వేయడం జరిగింది. నాలుగు నియోజక వర్గాలకు నోడల్ ఆఫీసర్లను నియమించి స్థానిక ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను సభ్యులుగా నియమించారు. వారు మండలంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌళిక వసతులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి చర్యలు చేపట్టనున్నారు. పోలింగ్ కేంద్రంలో వృద్ధులు, దివ్యాంగులకు వీలుగా ర్యాంప్ల ఏర్పాటు, ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచుతుంది. విద్యుత్, మంచినీటి సౌకర్యం, ఎండ తగులకుండా టెంట్ల ఏర్పాటు ఇలా అన్ని వసతులు కల్పించనున్నారు. అనారోగ్యం గురైతే వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉండనున్నారు.
జిల్లాలోని 23 మండలాలతో పాటు తుంగతుర్తి నియోజక వర్గంలోని అడ్డగూడూరు, మోత్కూరు, శాలిగౌరారం మండలాలు ఉన్నాయి. నాలుగు నియోజక వర్గాల పరిధిలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా హుజూర్నగర్ నియోజక వర్గంలోని గరిడేపల్లిలో 57, హుజూర్నగర్-58, మఠంపల్లి-45, నేరేడుచర్ల-43, పాలకవీడు-27, మేళ్లచెర్వు-42, చింతలపాలెం-36 ఉన్నాయి. కోదాడ నియోజక వర్గ పరిధిలో చిలుకూరులో-38, మునగాల-44, కోదాడరూరల్, పట్టణం- 104, నడిగూడెం-29 అనంతగిరి-33, మోతే-48 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సూర్యాపేట నియోజక వర్గంలో ఆత్మకూర్(ఎస్)లో 51, చివ్వెంల-47, పెన్పహాడ్-40, సూర్యాపేట రూరల్-47, సూర్యాపేట టౌన్లో 86 పొలింగ్ కేంద్రాలున్నాయి. తుంగతుర్తి నియోజక వర్గ పరిధిలో అర్వపల్లిలో 32, నాగారం-29, నూతనకల్-35, మద్దిరాల-31, తుంగతుర్తి-46, తిరుమలగిరి-40, శాలిగౌరారం-52, మోత్కూరు-31, అడ్డగూడూరులో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.