రామగిరి, జూన్ 8 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ‘గ్రూప్ -1 ప్రిలిమ్స్’ పరీక్షకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి పరీక్ష విధుల్లో పాల్గొనే లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్స్తో పాటు జిల్లా స్థాయి అధికారులకు సమావేశం నిర్వహించి పరీక్షలను పటిష్టంగా జరుపాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 16, 095 మంది అభ్యర్థులు హాజరవుతుండగా నల్లగొండ జిల్లా కేంద్రంలోనే 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష రోజు నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10.15 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్ పూర్తి చేసే విధానంపై అవగాహన కల్పిస్తారు. పటిష్ట భద్రత మధ్య, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఫ్యాన్స్, టాయిలెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష మెటీరియల్స్ తరలింపునకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి అభ్యర్థి టీఎస్పీఎస్సీ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష ముగిసే వరకు నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.