కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తయి పదో ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు, ఉద్యమకారులు, సామాన్య ప్రజానీకం భాగస్వామ్యంతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ నెల 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి గురువారం అమరుల సంస్మరణ దినోత్సవం వరకు 21 రోజులపాటు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రోజుకో ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా దశాబ్ది ఉత్సవాలు కొనసాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వాడవాడలా వేడుకల సందడి కనిపించింది. ఆయా కార్యక్రమాలకు అనుగుణంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మిళితం చేయగా పల్లెపల్లెను కదలించింది. తొమ్మిదేండ్లలో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా, సంక్షేమ పథకాల ప్రాధాన్యతను వివరించేలా వేడుకలు ప్రణాళికబద్ధంగా కొనసాగాయి. ఇదే సమయంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు లబ్ధిదారులుగా ఉన్న వారందరినీ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కలిగిన మేలును వివరించారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సారథ్యంలో ఎంపీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో దశాబ్ది ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయి.
– నల్లగొండ ప్రతినిధి, జూన్22 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూన్22(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 21 రోజులపాటు పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ ఘనంగా నిర్వహించింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలంతా సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నడిపించారు. కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని అధికారయంత్రాంగాన్ని రోజూవారీ కార్యక్రమాలకు అనుగుణంగా సమాయత్తం చేస్తూ వచ్చారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.
రోజుకో రీతిన వేడుక..
అన్ని శాఖల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆయా శాఖలు, అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖ లబ్ధిదారులతో నిత్యం పండుగను తలపించాయి. ఈ నెల 2న రాష్ట అవతరణ దినోత్సవంతో మొదలైన ఉత్సవ సందడి నిరంతరాయంగా కొనసాగింది. చివరి రోజు గురువారం తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను స్మరిస్తూ అమరుల దినోత్సవం దిగ్విజయంగా నిర్వహించారు.
ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి..
తెలంగాణ అంటేనే భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. దేశంలో ఎక్కడా లేని భిన్న వాతావరణం మనది. ఉత్సవాల్లో అణువణువునా తెలంగాణ కల్చర్ ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మామిడి తోరణాలు, పూలు, లైటింగ్తో ముస్తాబు చేశారు. ప్రజలతో ముడిపడి ఉన్న కార్యక్రమాల్లో నిత్యం బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో సందడి సందడిగా కనిపించింది. రైతు దినోత్సవం రోజున ఎడ్ల బండ్లతో ర్యాలీలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సాగునీటి దినోత్సవం రోజున సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం జలాలకు మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో జరిగిన లక్ష జన హారతి రాష్ర్టానికే హైలెట్గా నిలిచింది. కార్యక్రమంలో 1.16 లక్షల మంది భాగస్వామ్యంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ప్రతి కార్యక్రమంలోనూ అనునిత్యం వందలాది మందికి సామూహిక భోజనాలు ఏర్పాటు చేయడంతో సామరస్యత వెల్లివిరిసింది.
కొత్త పథకాలకు శ్రీకారం..
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో మంత్రి కేటీఆర్ ఒకేసారి 51 పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. అక్కడే కామన్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. నకిరేకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపణీని షురూ చేశారు. మన ఊరు – మన బడి పాఠశాలలను అందుబాటులోకి తెచ్చారు. స్కూళ్లలో రీడింగ్ కార్నర్స్(గ్రంథాలయాలు), డిజిటల్ తరగతులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీని ప్రారంభించారు. మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఇక ఇదే సమయంలో ఇప్పటికే అమలువుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయా పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేస్తూ ఉత్సవాలు కొనసాగించారు. రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉచిత చేప పిల్లల పంపిణీ, దళితబంధు, గొర్రెల పంపిణీ తదితర పథకాలపై పూర్తి వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో అభివృద్ధి నిధుల గురించి ప్రచారం చేశారు. పల్లె నుంచి పట్నం వరకు సభలు, ర్యాలీలు చేపట్టారు. బ్రోచర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రభుత్వ ప్రగతిని వివరించారు.