రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఊరూరా చెరువుల పండుగను గురువారం జిల్లా వ్యాప్తంగా సంబురంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామ కూడళ్ల నుంచి బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపుగా బయల్దేరారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా చెరువు కట్టలపై ముగ్గులు, తోరణాలను అందంగా అలంకరించారు. మహిళలు బతుకమ్మ, కోలాటం ఆడారు. అనంతరం చెరువు కట్టలపై సహఫంక్తి భోజనం చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి.. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి.. మోతూరులో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధి, పెరిగిన భూగర్భ జలాలు, మత్స్య సంపద, సాగునీటి లభ్యత తదితర అంశాలపై ప్రజలకు వివరించారు.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా అంతటా చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు గురువారం ఊరూరా జనం తరలివచ్చి సందడి చేశారు. పల్లె జీవనంతో విడదీయరాని చెరువుల అనుబంధాన్ని ప్రజలు తన్మయత్వంతో ఆస్వాదించారు. చెరువుల కట్ట కొమ్ములను ప్రత్యేకంగా ముగ్గులు, తోరణాలతో అలంకరించి సాయంత్రం వేడుకలను ఆరంభించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా బోనాలతో డప్పు వాయిద్యాల నడుమ చెరువు వద్దకు చేరుకుని కట్టమైసమ్మకు నైవేద్యం సమర్పించారు.
కోలాటాలు, డప్పుల మోతలతో నృత్యాలు చేసుకుంటూ బతుకమ్మలను చెరువు చెంతకు చేర్చారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను పేర్చి, ఆడబిడ్డలు గౌరమ్మను కొలుస్తూ ఆడిపాడారు. చెరువు నీటిలో బతుకమ్మలను వదలి పది కాలాల పాటు చల్లగా చూడాలంటూ చెరువమ్మకు దండాలు పెట్టారు. ఈ సందర్భంగా కట్ట మైసమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను చెరువుల్లో వదిలారు. రైతులు పటాకులు కాలుస్తూ చెరువుల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్స్యకారులు వలలను ప్రదర్శిస్తూ కదం తొక్కారు.
తెలంగాణ సంసృతి, సంప్రదాయాలను ఆవిషరిస్తూ చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. చెరువుల ఔన్నత్యాన్ని చాటుతూ ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించి, ఆలపించిన చెరువుల పాటలు అందరిలోనూ జోష్ నింపాయి. చెరువు గట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. సాయంత్రం తర్వాత పల్లెల్లో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఊరూరా చెరువుల పండుగలో ఆయా నియోజకవర్గాల్లో జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా నుంచి క్షేత్ర స్థాయి అధికారుల వరకు భాగస్వాములై ప్రజలను మరింత ఉత్సాహపరిచారు. చెరువు గట్టుపైనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికులతో కలిసి సహఫంక్తి భోజనాలు చేయడంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది.