ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కేతేపల్లి, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయి సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని పలు కాలనీల్లో రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. కుల, మతాలకు అతీతంగా జీవిస్తున్న దేశ ప్రజల నడుమ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని అన్నారు.
కేతేపల్లిలో విస్తృత పర్యటన
మండల కేంద్రంలో వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మురుగు కాల్వల్లో రోజుల తరబడి చెత్తా చెదారం తొలగించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే మందలించారు. మురుగు, చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆదేశించారు. సింగిల్విండో డైరెక్టర్ కొప్పుల ప్రదీప్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో తాసీల్దార్ డి.వెంకటేశ్వర్లు, సర్పంచులు బి.శ్రీనివాస్యాదవ్, బచ్చు జానకీరాములు, జాల వెంకట్రెడ్డి, కర్ర ప్రభాకర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు డి.సునీత, టి.వెంకన్నగౌడ్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ ఎర్రబోయిన వెంకన్నయాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ కె.సైదిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్నయాదవ్ పాల్గొన్నారు.