ఓటుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం వేగవంతంగా జరుగుతున్నది. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు కలిపి 88శాతం మంది ఓటర్లు తమ ఓటుకు ఆధార్ లింక్ చేసుకున్నారు. ఓటరు కార్డులో ఫొటోలు, పేర్లు, అడ్రస్ తప్పుగా పడితే సరిచేస్తున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నది. దాంతో జిల్లాలో ఉన్న డబుల్ ఓట్లు, బోగస్ ఓట్లకు చెక్ పడుతున్నది. nvsp.in అనే వెబ్సైట్లో ఓటరు నేరుగా తమ ఆధార్తో లింక్ చేసుకోవచ్చు. జిల్లాలో 1900 సంవత్సరంలో పుట్టిన వారు 12వేల మంది ఉన్నట్లు ఓటరు గుర్తింపు కార్డుల ద్వారా తేలింది. వారికి ఇప్పుడు ఒక్కొక్కరికి 123 ఏండ్లు ఉన్నట్లు అర్థం. ఇది గతంలో పొరపాట్ల వల్ల జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటరుతో ఆధార్ అనుసంధానం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నది. రేషన్ డీలర్లు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఓటును అనుసంధానం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆధార్తో లింక్ చేస్తున్నారు. సిబ్బంది సైతం దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. nvsp.in అనే వెబ్సైట్లో ఓటరు నేరుగా తమ ఆధార్తో లింక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్లే స్టోర్లో ఓటరు హెల్ప్లైన్ అప్లికేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని.. అందులో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య పొందుపరిచి ఆధార్ను అనుసంధానం చేసుకోవచ్చు. ఆధార్ లేదా మరో 10 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానితో ఓటరు కార్డును అనుసంధానం చేసుకునే వీలున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు 91 శాతం వరకు ఓటుతో ఆధార్ లింక్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలకు కలిపి 4,17,392 మంది ఓటర్లుండగా, ఇందులో 3,66,737 మంది ఓటును ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,00,451 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,79,989 మంది ఆధార్తో అనుసంధానం చేశారు. అంటే 90 శాతం ప్రక్రియ పూర్తయ్యింది. ఇక ఆలేరు నియోజకవర్గంలో 2,16,941 మంది ఓటర్లుండగా, ఇందులో 1,96,748 మంది ఆధార్తో లింక్ చేసుకున్నారు.
ఓటరు జాబితాలో నకిలీ ఓట్లు లేకుండా చేసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని సవరించింది. దీనిలో భాగంగా ఓటుకు ఆధార్ను లింక్ చేస్తున్నారు. ఆధార్ను లింక్ చేయడం ద్వారా వేర్వేరు చోట్ల రెండు, మూడు ఓట్లు ఉంటే వెంటనే సర్వర్లో డబుల్గా చూపిస్తుంది. దీని ద్వారా బోగస్, నకిలీ ఓట్లను పసిగట్టి తొలగించేందుకు వీలుంటుంది. జిల్లాల్లో ఆలేరు, నియోజకవర్గాల పరిధిలో అనేక మందికి స్థానికంగా ఉండటంతో పాటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లోనూ ఓటు ఉన్నది. ముఖ్యంగా ఉప్పల్ పరిధిలో ఎక్కువ మందికి ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు అధికారులు వీటిని గుర్తించి తొలగిస్తున్నారు. చిన్న ఫొటోలు, ఫొటోలు సరిగా లేని, రివర్స్ ఉన్న ఫొటోలను కూడా అధికారులు సరిచేస్తున్నారు.
ఓటు అనుసంధానం సమయంలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. జిల్లాలో 1900లో పుట్టినవాళ్లు ఇంకా 12 వేల మంది ఉన్నట్లు ఓటరు గుర్తింపు కార్డుల ద్వారా తేలింది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 123 ఏండ్లు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. వాస్తవానికి వాళ్లకు ఇప్పుడు 40 నుంచి 50 ఏండ్లు మాత్రమే ఉన్నాయని, ఇది గతంలో చేసిన చిన్నచిన్న పొరపాట్లు వల్ల జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పాన్కార్డులో తప్పుడు వివరాలు పొందుపరచడం, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ సమయంలో ఇలా జరిగి ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో 50 వేల మంది వరకు 1900లో పుట్టినవాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు.