మేళ్లచెర్వు, ఫిబ్రవరి 23 : మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెర్వులో ఆరు రోజులుగా జరిగిన ఇష్టకామేశ్వరీ సహిత శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి రూ.40,07,720 ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ. 10,55,129 పెరిగింది. దేవాదాయ శాఖ అధికారి నిఖిల్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.10,05,841 ఆదాయం రాగా గతేడాదితో పోలిస్తే రూ. 1,43,539 ఎక్కువ వచ్చింది. ఆర్జిత సేవల ద్వారా రూ.30,01,879 ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి కొండారెడ్డి తెలిపారు.
వైభవంగా పవళింపు సేవ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పవళింపు సేవ వైభవంగా జరిగింది . హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి దంపతులు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ వర్రా వెంకట్రెడ్డి, ఈఓ గుజ్జుల కొండారెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతి ప్రదానం
చివరి రోజు సీనియర్స్ విభాగ పోటీల్లో 11 జతలు పాల్గొన్నాయి. పొద్దుపోయేవరకు జరిగిన ఈ పోటీలను వీక్షించేదుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. కృష్ణాజిల్లా కానూరుకు చెందిన దేవభక్తుని సుబ్బారావు ఎద్దులు ప్రథమ, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన పులగం తిషజ్ఞారెడ్డి ఎద్దులు ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి. బుధవారం అర్ధరాత్రి దాటే వరకు జరిగిన జూనియర్స్ పోటీల్లో కడప జిల్లా కల్లూరుకు చెందిన పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ ఎద్దులు ప్రథమ, హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్ బుల్స్ రోహన్బాబు గిత్తలు ద్వితీయ, హుజూర్నగర్కు చెందిన సుంకి సురేందర్రెడ్డి గిత్తలు తృతీయ, కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన మేక కృష్ణమోహన్ ఎద్దులు నాలుగో బహుమతి గెలుచుకున్నాయి. విజేతలకు ఎమ్మెల్యే సైదిరెడ్డి దాతలతో కలిసి ట్రాక్టర్లు, బైక్లు, నగదు బహుమతులు అందజేశారు.