చివ్వెంల, మార్చి 9 : మండలంలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 12వరకు జరుగనున్నాయి. 15 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ.. ఈ సారి వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ఆలయం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, మెడికల్ క్యాంపు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. బ్రహ్మోత్సవాలను గతం కంటే వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చకిలం కృష్ణకుమార్ తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
2002లో వెలుగులోకి వచ్చిన ఉండ్రుగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం చుట్టూ కొండలు, పచ్చదనం, కోనేరు, కోట గోడలు, పురాతన కట్టడాలు భక్తులకు ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. స్వామివారికి మొక్కులు, ముడుపులు చెల్లించుకోవడానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో ఆలయం ఎదుట సీసీ రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, రూ.10లక్షలతో కోనేరుకు ఘాట్, రూ.20 లక్షలతో వసతి గృహ నిర్మాణ పనులు చేపట్టారు.