భువనగిరి కలెక్టరేట్ / రామగిరి / సూర్యాపేట, జూన్ 11 : టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం కట్టుదిట్టంగా నిర్వహించారు. 28,909 మంది అభ్యర్థులకు గాను 20,128మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను యాదాద్రిభువనగిరి, సూర్యాపేట కలెక్టర్లు పమేలా సత్పతి, వెంకట్రావ్, వినయ్క్రిష్ణారెడ్డి పరిశీలించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో 12కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,644మంది అభ్యర్థులకు గాను 2,380మంది హాజరయ్యారు. 65.31శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల, జాగృతి డిగ్రీ కళాశాలలను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 31కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్షకు 16,095మంది అభ్యర్థులకు గాను 11,414మంది హాజరయ్యారు. 70.92 హాజరుశాతం నమోదైంది పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు పర్యవేక్షించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని 32పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 9,170మంది అభ్యర్థులకు గాను 6,334మంది హాజరయ్యారు. పరీక్షకు 69.07శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అకారులు తెలిపారు. కలెక్టర్ ఎస్.వెంకట్రావు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించి మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అభ్యర్థులతో జిల్లాకేంద్రాలు సందడి
గ్రూప్-1 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులతో యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాకేంద్రాలు సందడిగా మారాయి. పరీక్ష ముగిసాక ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చూశారు.