నకిరేకల్, అక్టోబర్ 01 : విజయదుర్గ రైస్ మిల్లులో జరిపిన తనిఖీల్లో సేకరించిన శాంపిల్ బియ్యం ల్యాబ్కు పంపగా రిపోర్టులో అవి రేషన్ బియ్యం కావని తేలిందని సివిల్ సప్లై నకిరేకల్ డిప్యూటీ తాసీల్దార్ జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి దొడ్డు వడ్లు కొన్నారని, ఆ వడ్లను పట్టి బియ్యం నిల్వ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. మిల్లు నిర్వాహకులు తాళం వేసిన సమయంలో నల్లగొండలోని సివిల్ సప్లై కార్యాలయంలో మిల్లుకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు వెళ్లారని తెలిపారు. శాంపిల్స్ సేకరించిన బియ్యం తాలూకా 70 బస్తాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అవి రైస్ మిల్లులోనే ఉన్నట్లు గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు.