నల్లగొండ, ఏప్రిల్ 24 : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు అమానుషంగా చంపడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం రాత్రి పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలన్నారు.
ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకుని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తులు తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నట్లు తెలిపారు. ఉగ్రదాడులకు దేశంలోని ముస్లింలను దోషులుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఎంత మాత్రం సరైనది కాదన్నారు. గత పదేండ్లుగా ఉగ్రవాదాన్ని నిర్మూలించామని బీజేపీ చెప్పుకుంటున్న గొప్పల డొల్లతనం నేడు బయటపడిందని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడుల్లో ప్రభుత్వ భద్రతా వైఫల్యాలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయడం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని అన్నారు.
దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషం రెచ్చగొడుతున్న మతోన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాశం, సిహెచ్ లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, దణ్ణంపల్లి సత్తయ్య కొండ అనురాధ, మల్ల మహేశ్, పరిపూర్ణాచారి, వెంకన్న, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఉమా, రవి, నరసింహ, నరేశ్, శివ, మధు పాల్గొన్నారు.
CPM : ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించాలి : తుమ్మల వీరారెడ్డి