యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో వణుకు పెరుగుతున్నది. రాత్రివేళ శీతల గాలులతో ఇగం చంపేస్తున్నది. వారం రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయి.
దాంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువ రికార్డ్ అవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 11.4, నల్లగొండలో 11.45, సూర్యాపేట జిల్లాలో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తుండగా.. ఉదయం తొమ్మిదైనా సూర్యుడు కనిపిస్తలేడు. ఉదయం తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చే పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, కార్మికులు, కూలీలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.