సజావుగా సాగింది. జిల్లావ్యాప్తంగా 53,213 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 42,469 మంది హాజరయ్యారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ ప్రాంతాల పరిధిలో 188 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఆయా సెంటర్ల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి ఆలస్యంగా వచ్చిన వాళ్లకు అనుమతి నిరాకరించారు. నల్లగొండతోపాటు పలు సెంటర్లను కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి తనిఖీ చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో ఆయా సెంటర్లు, ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. చంటి పిల్లలతో వచ్చిన మహిళలు తమ సహాయకుల వద్ద పిల్లలను ఉంచి పరీక్ష రాశారు.
– రామగిరి, జూలై 1
రామగిరి, జూలై 1: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం గ్రూప్ 4 పరీక్ష సజావుగా ముగిసింది. 188 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 53,213 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 42,469 మంది హాజరయ్యారు. 10,739 మంది గైర్హాజరయ్యారు. 79.82 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2కు 42,353 మంది అభ్యర్థులు హాజరుకాగా 10, 855 గైర్హాజరయ్యారు. 79.60 శాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డితో పాటు అదనపు కలెక్టర్ ఖుష్భూగుప్తా, భాస్కర్రావు తనిఖీ చేశారు. నల్లగొండలో తెల్లవారుజామును 5 గంటల నుంచే అభ్యర్థుల సందడి నెలకొంది. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. పరీక్ష అనంతరం అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఐడీ ప్రూఫ్లో పేరు తేడాతో పరీక్షకు నిరాకరణ
నకిరేకల్, జూలై 1 : నకిరేకల్ పట్టణంలోని శాస్త్ర స్కూల్ పరీక్షా కేంద్రం వద్ద ఓ అభ్యర్థిని పరీక్షకు అనుమతించలేదు. వివరాల్లోకెళ్తే.. శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్కు చెందిన అప్పం అశ్విని నకిరేకల్లో పరీక్ష కేంద్రం వద్దకు రాగా.. అధికారులు హాల్ టికెట్, ఆధార్ కార్డు చూపమని అడిగారు. అశ్విని హాల్ టికెట్లో పున్న రమాదేవి అని, ఆధార్ కార్డులో అప్పం అశ్విని అని ఉంది. దీంతో అధికారులు హాల్ టికెట్లో ఉన్న రమాదేవికి సంబంధించిన ఐడీ ప్రూఫ్ చూపితేనే పరీక్షకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దాదాపు అరగంట సేపు బతిమిలాడినా అనుమతించక పోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయింది.