సూర్యాపేట రూరల్/నాగారం, జూన్ 19 : 70 ఏండ్ల పరాయి పాలనలో ధ్వంసమైన పర్యావరణానికి తెలంగాణ హరితహారం గొప్పవరమని, నేడు ఆ ఫలితాలు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం సూర్యాపేట పట్టణ పరిధి గాంధీనగర్, నాగారం మండలం ఈటూరులో నిర్వహించిన హరితోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు మొక్కలు నాటే కార్యక్రమం అటవీ శాఖకే పరిమితమయ్యేదని, నాటి పాలకులు పచ్చదనం పెంపుకోసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడిపించిన తీరు గానే, హరితోద్యమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. దశాబ్దాలపాటు కరువు ప్రాంతంగా మారిన తెలంగాణ నేడు పచ్చని పంటలు, దట్టమైన చెట్లతో చూడముచ్చటగా ఉందంటే హరితహారం కార్యక్రమమేనని చెప్పారు. అతి తక్కువ కాలంలో దేశంలో అత్యధిక గ్రీన్ రెవల్యూషన్ సాధించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం, అనారోగ్యాల నుంచి రక్షించుకోవడానికి చెట్లు ఎంతో దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
70 ఏండ్ల పరాయి పాలనలో ధ్వంసమైన పర్యావరణానికి హరితహారం గొప్ప వరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్లో, నాగారం మండలం ఈటూరులో సోమవారం 9వ విడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 2014కు ముందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టించుకున్న నాధుడే లేడన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నడిపించిన తీరుగానే హరిత ఉద్యమం నిర్వహించి ప్రకృతి పునరుజ్జీవనానికి కృషి చేశారని తెలిపారు. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం నేడు పచ్చని పంటలతో, దట్టమైన చెట్లతో చూడముచ్చటగా ఉన్నదంటే హరితహారం వల్లేనని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదు.. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించడమని సగర్వంగా చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అతి తక్కువ కాలంలో దేశంలో అత్యధిక గ్రీన్ రెవల్యూషన్ సాధించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లాలో 7.50కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటిన 273.33కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్ ఇవ్వడంతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని చెప్పారు. హరితహారం 9వ విడుతలో భాగంగా ఒక్కరోజే 2లక్షల మొక్కలు నాటగా.. వర్షాలు పడిన తర్వాత వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. ఆధునిక సమాజంలో మానవుడి మనుగడ, ఆయు ప్రమాణాలు తగ్గడానికి ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యమేనన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనారోగ్యాలకు చెట్లను పెంచడం ద్వారా అడ్డుకట్ట వేయవచ్చని సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. హరిత తెలంగాణ సాధనలో 9 ఏండ్లలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షి అన్నారు. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. మంచి వాతావరణమని, ఆకుపచ్చ తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ రామానుజులరెడ్డి, కౌన్సిలర్ వట్టె రేణుక, బీఆర్ఎస్ నాయకులు ఎండీ చాంద్పాషా, ఎస్కే రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా హరితహారం : ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నాగారంలో జరిగిన కార్యక్రమలో ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడుతూ.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణకు హరితహారంలో రెండు లక్షల మొక్కలు నాటగా ఈటూరులో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2700 మొక్కలు నాటినట్లు చెప్పారు. 230 కోట్ల మొక్కలు లక్ష్యంగా హరితహారం కార్యక్రమం మొదలైందని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండు లక్షల మొక్కలు నాటేందుకు కలెక్టర్ వెంకట్రావ్ అధికారులతో అన్ని ఏర్పాట్లు చేయించినట్లు చెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని కంఠమహేశ్వరస్వామి ఆలయంలో, డి.కొత్తపల్లిలోని గంగదేవమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్టర గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, కలెక్టర్ వెంకట్రావు, పీడీ కిరణ్కుమార్, తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ కొమ్మినేని స్రవంతీసతీశ్, ఎంపీపీ కూరం మణీవెంకన్న, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రజాక్, సర్పంచ్ పేరాల సరిత, తాసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, ఎంపీడీఓ గాలి శోభారాణి, బీఆర్ఎస్ నాగారం మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, నిమ్మల శ్రీనివాస్, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.