తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ప్రజలకు కల్పించిన శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తదితర విజయాలను తెలియజేస్తూ ఆదివారం జిల్లా కేంద్రాల్లో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో పోలీస్, ఎక్సైజ్, అటవీ, ఆరోగ్య, అగ్నిమాపక శాఖలు భాగస్వామ్యమయ్యాయి. బైక్లు, పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోట్స్, ఫైర్ వెహికిల్స్ ర్యాలీ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సూర్యాపేట, నల్లగొండలో జరిగిన వేడుకల్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, ఫ్రెండ్లీ పోలీసు విధానం తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేస్తున్నదని, తొమ్మిదేండ్లలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగ లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలతో సతమతమైన గ్రామాలు నేడు ప్రశాంతంగా మారాయని చెప్పారు.
సూర్యాపేట సిటీ, జూన్ 4 : యావత్ భారతదేశంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. షీటీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఘనత కెక్కిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్యాపేట పోలీసులు నిర్వహించిన సురక్షా దినోత్సవంలో మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు పోలీసులు నిర్వహించిన సురక్షా ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కక్షలు, కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో సీఎం కేసీఆర్ కృషితో శాంతి కపోతాలు ఎగురుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూచా తప్పకుండా పోలీసు శాఖ అమలు చేస్తున్నందునే తొమ్మిదేండ్లలో శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలుగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఫ్యాక్షన్ గ్రామాల్లోనూ ప్రశాంతత పరిఢవిల్లుతున్నదన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టడిలో ఉన్నందునే పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి 50వేల పరిశ్రమలు నెలకొల్పారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను అమలు పరుస్తున్నందునే తెలంగాణ పోలీసులు అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారన్నారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, రవి, సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.