యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నదని, మునుగోడు ప్రజలంతా ఏకతాటిపై ఉండి కాషాయ పార్టీ కుట్రలను ఎండగట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో 70వేల మంది గులాబీ సైనికులు బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే నంబర్ వన్గా నిలిచాయన్నారు. బీజేపీ 20ఏండ్లుగా పాలిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికీ పరిస్థితులు బాగాలేవని, ఇంకా పింఛన్ రూ.600 దాటలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రజలకు పింఛన్లు, రైతుబంధు ఎందుకు ఇస్తున్నారని కేంద్రం పెద్దలు ప్రశ్నిస్తున్నారని, రాష్ర్టానికి రావల్సిన నిధులను కూడా అడ్డుకుంటున్నారని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టడం లేదని రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చావడానికైనా సిద్ధంగా ఉన్నానని, మీటర్లు మాత్రం పెట్టబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. దీంతో తెలంగాణపై కేంద్రం కక్ష పెంచుకుందని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుంటే.. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ను కలిసి జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. దేశం బాగు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని చెప్పారు. దేశంలోని పార్టీలన్నీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ మాత్రం ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారని అన్నారు. ధాన్యం దిగుబడుల్లో దేశంలోనే నల్లగొండ టాప్ ప్లేస్లో నిలిచిందని చెప్పారు.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, నాడు జనం కష్టాలను చూసి కేసీఆర్ పార్టీ పెట్టారని మంత్రి చెప్పారు. తెలంగాణ కోసం కొట్లాడి రాష్ర్టాన్ని సాధించారని, ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచం అబ్బురపడేలా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. సమైక్య పాలనలో ఫ్లోరైడ్ రక్కసితో నల్లగొండ జనం అరిగోస పడ్డారని తెలిపారు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ నీళ్లతో ఆరేండ్లలోనే ఫ్లోరైడ్ను అంతం చేశామన్నారు. ఇప్పుడు మునుగోడు సుభిక్షంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. మునుగోడులో ఒక్క ఫ్లోరైడ్ కేసూ నమోదు కాలేదని పార్లమెంట్లో కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు.