రామగిరి, జనవరి 26 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గైడ్లైన్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం గురువారం జీఓ నెం.5 విడుదల చేసింది. ఈ నెల 27న ప్రకటించాల్సిన ఖాళీల వివరాలు, సీనియార్టీ జాబితాలను నల్లగొండ విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఈ నెల 28నుంచి 30వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే.. జీహెచ్ఎం పదోన్నతులకు అర్హులైన వారి ధ్రువపత్రాల పరిశీలన గురువారం పూర్తిచేసిన విద్యాశాఖ ఎస్జీటీ టు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులకు అర్హులైన వారి తాత్కాలిక జాబితా విడుదల చేసింది. వారికి శుక్రవారం నల్లగొండలోని డైట్లో ధృవపత్రాల పరిశీలన చేస్తున్నట్లు డీఈఓ బి.భిక్షపతి వెల్లడించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, లోకల్బాడీ విభాగంలో 2,774 ఖాళీలను చూపించారు. వీటిల్లో ప్రభుత్వంలో క్లియర్ వేకెన్స్లు 110, లాంగ్స్టాండింగ్లో 73 చూపించారు. అదేవిధంగా లోకల్బాడీ విభాగంలో ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్స్లో 1009, లాంగ్స్టాండింగ్లో 1.582 మొత్తం.. 2,591 చూపించారు. రెండు విభాగాల్లో కలిపి 2,774 ఖాళీలను ప్రకటించిన విషయం విదితమే. జీహెచ్ఎంలకు ఐదేండ్ల సర్వీసు, ఉపాధ్యాయులకు 8 సంవత్సరాల సర్వీసును నిర్ణయించారు. ఆ మేరకు బదిలీలు జరుగనున్నాయి.
జీహెచ్ఎం ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వంలో 50, లోకల్ బాడీలో 340మంది స్కూల్ అసిస్టెంట్లు జీహెచ్ఎంకు అర్హత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. వారికి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు డీఈఓ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. అనంతరం జీహెచ్ఎం పూర్తి సీనియార్టీ జాబితాను సవరించి deonalgonda.blogstop. com వెబ్సైట్లో గురువారం రాత్రి పొందుపర్చారు. అభ్యంతరాలుంటే నేరుగా డీఈఓ కార్యాలయంలో సంబంధిత కౌంటర్స్లో ఫిర్యాదు చేయాలని డీఈఓ వెల్లడించారు.
నేడు డైట్లో ధ్రువపత్రాల పరిశీలన
నల్లగొండ జిల్లాలో ఎస్జీటీ/ తత్సమాన కేటగిరీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి అర్హులైన వారి జాబితాను జిల్లా విద్యాశాఖ గురువారం రాత్రి వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని జాబితాలో ఉన్న వారికి సమాచారం సైతం అందించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 451మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి తాత్కాలికంగా ఎంపికయ్యారు. వారికి శుక్రవారం ఉదయం 9గంటల నుంచి నల్లగొండలోని డైట్లో ధ్రువపత్రాల పరిశీలన చేస్తున్నట్లు డీఈఓ వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్స్కు అర్హత సాధించిన వారు ఒరిజినల్ సర్వీస్ పుస్తకం, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, పండిట్ ట్రైనింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, డిపార్టుమెంట్ పరీక్షల ఫలితాలు, ఎస్సీ, ఎస్టీ ఒరిజినల్ సర్టిఫికెట్, పీహెచ్సీ అయితే పీహెచ్సీ సర్టిఫికెట్తో హాజరు కావాల్సి ఉంటుంది.
రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఈ నెల 28నుంచి 30వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అ తర్వాత హార్డ్ కాపీలను ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వరకు ఆన్లైన్ దరఖాస్తులకు పూర్తి సమాచారంతో జిరాక్స్ను జత చేసి కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓలకు అందజేయాల్సి ఉంటుంది. వాటిని ఫిబ్రవరి 3నుంచి 6వరకు డీఈఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
గైడ్లైన్స్ మేరకు ప్రక్రియ
విద్యాశాఖ, ప్రభుత్వం వెల్లడించిన గైడ్లైన్స్ మేరకు నల్లగొండ జిల్లాలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తాం. జీహెచ్ఎం అర్హులైన వారి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వారి పూర్తి జాబితాను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. అభ్యంతరాలుంటే నేరుగా డీఈఓ కార్యాలయంలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేయవచ్చు. స్కూల్ అసిస్టెంట్ అర్హులైన టీచర్లకు డైట్లో నేటి ఉదయం 9గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభిస్తాం. అందరూ విధిగా హాజరు కావాలి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ