మిర్యాలగూడ, ఆగస్టు 14 : ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 నుంచి 9వ తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొందించారు. కార్యక్రమ ఆవశ్యకత, లక్ష్యాలు, విధివిధానాలు, వాచకాలు, బోధనా ప్రణాళికలు వంటి అంశాలపై అవగాహన కోసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఉన్నత పాఠశాలల్లో అమలు
నల్లగొండ జిల్లాలో ఉన్నతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 226 హైస్కూళ్లు, 27 కేజీబీవీలు, 17 మోడల్ స్కూళ్లు, 126 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
ఉన్నతి కార్యక్రమం అమలు కోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు, సబ్జెక్ట్ టీచర్ల నుంచి ఎంపిక చేసిన 28 మంది రిసోర్స్పర్సన్లను గుర్తించారు. హెచ్ఎంలకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో హైదరాబాద్లోని టీఎస్ ఐపార్డ్లో శిక్షణ ఇచ్చారు. రిసోర్స్పర్సన్లకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో హైదరాబాద్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారు మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
బోధనా ప్రణాళిక ఇలా..
విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధనా ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. వార్షిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. 45 నిమిషాల పీరియడ్లో చెప్పాల్సిన అంశాలను పిల్లల స్థాయికి అనుగుణంగా రూపొందించుకుంటారు. ప్రతి పీరియడ్లో భాషతో పాటు నాన్ లాంగ్వేజ్ విషయంలో కూడా కొంత సమయాన్ని ప్రతి పీరియడ్లో పిల్లలతో చదివించడానికి కేటాయిస్తారు. సబ్జెక్టుల వారీగా నిర్దేశించిన సామర్థ్యాలను పరీక్షించి పిల్లల ప్రగతిని రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రధానోపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే పాఠశాల స్థాయి సమీక్ష సమావేశంలో పిల్లల ప్రగతిని చర్చిస్తారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, సమీక్ష సమావేశాల్లో ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసి వారికి మార్గదర్శనం చేస్తారు.
ప్రారంభంలోనే బేస్లైన్ టెస్ట్
ఉన్నతి కార్యక్రమం 6 నుంచి 9 తరగతల విద్యార్థులకు ఉద్దేశించింది. ఇందులో భాగంగా ప్రారంభంలోనే విద్యార్థులకు బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందుకోసం ప్రశ్నపత్రం రూపొందించి పిల్లల స్థాయిని గుర్తించి నమోదు చేస్తారు.
ఉన్నతి కార్యక్రమ లక్ష్యం…
భాషలో సామర్థ్యం పెంచడం, ముఖ్యంగా చదవడం, రాయడంతో పాటు విద్యార్థుల వారీగా అభ్యసన ఫలితాలను సాధించడమే ఉన్నతి లక్ష్యం. నాన్ లాంగ్వేజెస్లో పాఠానికి అవసరమైన పూర్వ భావనలు, పలు అంశాలపై అవగాహన కలిగించే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన అభ్యసనం పెంపొందిస్తారు. కరోనా అనంతర పరిస్థితుల్లో విద్యార్థులు భాషతో పాటు వివిధ సబ్జెక్టుల్లో వెనుక బడి ఉన్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే వారు పై తరగతులకు వెళ్లినప్పటికీ అభ్యసన పరంగా, అకడమిక్ పరంగా స్టాండర్డ్ పొందలేరు. దీనిని అధిగమించడానికి ఉన్నతి కార్యక్రమం దోహదపడుతుంది.
మంచి ఫలితాలు సాధిస్తాం
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగు పరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమం లాగే ఉన్నత పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేస్తాం. విద్యార్థుల పరిస్థితిని అంచనా వేస్తూ నిరంతరం పర్యవేక్షించి ఉన్నతి కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధించే విధంగా పనిచేస్తాం. ముఖ్యంగా పిల్లలకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ చదవడం, రాయడంపై అవగాహన కల్పిస్తాం.
-రామచంద్రయ్య, జిల్లా కోఆర్డినేటర్