నేరుగా ఖాతాకే డబ్బు సంతోషకరంచేనేత మిత్ర పథకం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. గతంలో సబ్సిడీ పొందాలంటే ఎన్నో సమస్యలు ఉండేవి. మాస్టర్ వీవర్స్ ద్వారా జీఎస్టీ ఉన్న బిల్లులు 45 రోజులకు ఒకసారి అందజేస్తే సబ్సిడీ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పుడుఏ సమస్యా లేకుండా నేరుగా మా ఖాతాలో డబ్బులు వేసామనడం సంతోషకరం. ఇది చేనేత కార్మికులకు నెలనెలాఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముడి సరుకులకొనుగోలుకు ఈ డబ్బులు తోడవుతాయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నేతన్నలకు చేయూత, చేనేత బీమా, చేనేత మిత్ర పథకాలు మాకు ఎంతో ఉపయోగకరమైనవి. వీటిని నిరంతరంకొనసాగించాలి.
– చిట్టిప్రోలు దేవి,సుంకనపల్లి, చిట్యాలమండలం
సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న బతుకుల్లో స్వరాష్ట్రంలో వెలుగులు నిండుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి నేతన్నలకు అండగా నిలుస్తున్నది. ఇటీవల వరకు సబ్సిడీ చేనేత మిత్ర పథకాన్ని అమలు చేసింది. దీని కింద నేత కార్మికులకు రసాయనాలు, నూలుపై 40శాతం రాయితీ కల్పించింది. అయితే.. కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియకపోవడంతో రాయితీ పొందలేకపోతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపై మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికుడికీ నెలకు రూ.3వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి దీనికి శ్రీకారం చుట్టింది. ఆ వెంటనే నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.3వేలు జమ చేస్తున్నది. ఇందులో నేత కార్మికుడికి రూ.2వేలు, అనుబంధ కార్మికుడికి వెయ్యి ఖాతాల్లో వేస్తున్నది. ఇప్పటికే నేతన్నలకు డబ్బులు చేరుతున్నాయి. జిల్లాలో మొత్తం 10,600 మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం తెలంగాణ చేనేత మగ్గం పథకాన్ని ప్రకటించింది. ఇటీవల చేనేత దినోత్సవంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే పథకానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకం కింద నేతన్నలకు గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలను పంపిణీ చేయనున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు దూరం కానున్నాయి. అంతేకాకుండా శ్రమ తగ్గి నాణ్యమైన చేనేత వస్ర్తాల ఉత్పాదకత పెరుగుతుంది. చేనేత కార్మికులతోపాటు అనుబంధ కార్మికులకు కంటి, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులకు ఆరోగ్య కార్డు ద్వారా చికిత్స అందించేందుకు సర్కారు ముందుకొచ్చింది. ప్రతి కుటుంబానికీ ఏటా రూ.25వేల వరకు వైద్య సదుపాయం కల్పించనుంది. కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల కోసం రూ.25వేలు అందించనున్నది.
నేత కార్మికుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రత్యేక పొదుపు పథకంతో నేతన్నకు చేయూత, రూ.5లక్షల చేనేత బీమాతోపాటు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. చేనేత రుణమాఫీ, నేత కార్మికులకు పింఛన్, బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో నేత కార్మికుల బతుకులు మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో భువనగిరి, ఆలేరు, నకిరేకల్, మునుగోడు నియోజకర్గాల చేనేత కార్మికులు సూరత్, భీమండి, కోయంబత్తూర్ తదితర ప్రాంతాలకు పొట్ట చేతబట్టుకొని వెళ్లేవారు. ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు వలసలు ఆగడంతోపాటు అక్కడున్న వాళ్లు సొంతూర్లకు తరలి వస్తున్నారు. అంతేకాకుండా నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయి.
మా స్వగ్రామం గట్టుప్పల్. నేను 15 ఏండ్లుగా మగ్గం నేస్తూనే జీవనం గడుపుతున్నా. పదేండ్ల క్రితం నల్లగొండకు వచ్చిన. ఇక్కడ కూడా మగ్గం నేసుకుంటూ జీవనం గడుపుతున్నా. ఎన్నో ఏండ్లుగా గోస తీస్తూ జీవనం సాగించినం. మా నేత కార్మికులు ఆకలితో చనిపోయిన పరిస్థితులు వచ్చాయి. గత పాలకులు చేనేత రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా గురించి ఆలోచించి మమ్ములను గుర్తించిండు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసిండు. దీంతో మా కుటుంబాల్లో సంతోషం నింపినట్లయింది. చేనేత మిత్ర కింద నెలకు రూ.3వేలు అందుతున్నాయి. త్రిఫ్టు పథకం కింద నెలకు నేను రూ.1200, నా కో వర్కర్ రూ.800 చొప్పున 36 నెలలు కడితే.. ప్రభుత్వం డబుల్ ఎమౌంట్ అందించనుంది. ఇలా మాకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా అండగా ఉంటాం.
– ముశం రమేశ్, చేనేత కార్మికుడు, శాంతినగర్, నల్లగొండ
సమైక్య పాలనలో చేనేతల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి. మా గురించి కనీస ఆలోచన కూడా చేయలేదు. చేతినిండా పని లేక ఉపాధి కరువై తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేతన్నల బతుకులు మారాయి. వీవర్ ఖాతా ద్వారా నాకు రూ.2వేలు, అనుబంధ కార్మికుల ఖాతాలో నా భార్యకు 5వందలు కలిపి 2,500 రూపాయలు మా కుటుంబానికి వస్తున్నాయి. అవి మాకు ఎంతో ఆసరా అవుతున్నాయి. అలాగే చేనేతలకు పొదుపు పథకం, పింఛన్లు, రాయితీలు, రుణమాఫీ, ఆధునిక యంత్రాల పథకం, నేతన్న బీమా, చేనేత మిత్ర పథకాలు అమలు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపారు. బీఆర్ఎస్ సరారుకు రుణపడి ఉంటాం. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించుకుంటాం.
– వరాల పాండు, చేనేత కార్మికుడు, గట్టుప్పల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన చేనేత మిత్ర పథకం నేతన్నలకు వరం లాంటిది. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. ఈ పథకం ద్వారా నెలనెలా 3వేల రూపాయలు కార్మికుల ఖాతాల్లో జమ చేయడం చాలా బాగుంది. ఇందులో మధ్య దళారులు ఉండరు. గతంలో ఎవరూ చేనేత కుటుంబాలను పట్టించుకోలేదు. తాతల నుంచి వస్తున్న వృత్తి బాగలేక వదిలేస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. అడగకుండానే చేనేత బీమా, పింఛన్లు, పావలా వడ్డీకి రుణాలు, చేనేత రాయితీలు, ఆధునిక యంత్రాల పథకం తీసుకొచ్చారు. వీటితో వృత్తికి జీవం పోసి చేనేతకు పూర్వవైభవం తెచ్చారు. ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. లేదంటే నేతన్నలు వృత్తి మానేసి కూలి కోసం వలస బాట పట్టాల్సి వచ్చేది.
– గుర్రం కొండల్, ఎల్లంబావి గ్రామ సర్పంచ్, చౌటుప్పల్ మండలం
గతంలో చేనేత మిత్ర పథకం ద్వారా సబ్సిడీ రూపంలో నూలు కొంత మంది కార్మికులకు అందేది. అందులో లొసుగులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ పథకాన్ని నగదు రూపంలోకి మార్చింది. కార్మికులందరికీ నగదు రూపంలో చేనేత మిత్ర పథకం అందజేయడం హర్షించదగ్గది. ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మికులు స్వాగతిస్తున్నారు. ఇది భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగేలా ప్రభుత్వం జీఓ తెస్తే బాగుంటుంది. కార్మికులకు పని కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. దీంతోపాటు చేనేత వస్ర్తాలకు మార్కెట్ కల్పిస్తే కార్మికులకు, చేనేత వృత్తికి మరింత బాగుంటుంది. టెస్కో ద్వారా చేనేత వస్ర్తాలు కొనుగోలు చేయడానికి కృషి చేస్తే వస్త్ర నిల్వలు పేరుకుపోకుండా ఉండి కార్మికులకు సరైన న్యాయం జరుగుతుంది. టెస్కో ద్వారా ఇతర రాష్ర్టాల్లో చేనేత వస్త్ర విక్రయశాలలు ప్రారంభిస్తే మార్కెటింగ్ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
– గుర్రం నర్సింహ, చేనేత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు (చౌటుప్పల్ రూరల్)
చేనేత మిత్ర నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపింది. చేనేత కార్మిక సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల పక్షాన దేవుడు. చేనేత మిత్ర పథకం ద్వారా నిరుపేదలైన నేత కార్మికుల సంక్షేమానికి పాటుపడడం హర్షణీయం. ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేతన్నల బతుకులు మారాయి.
– అమృతం నాగులు, చేనేత కార్మికుడు, కొలనుపాక, ఆలేరు మండలం
35 ఏండ్లుగా చేనేత వృత్తే మా జీవనాధారం. మా గ్రామంలో 100కు పైగా కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన కాన్నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేనేత కార్మికులకు చేసిందేమీ లేదు. నూలు, రసాయనాల ధరలు భారీగా పెంచడంతో మా కుటుంబాలు నష్టాల పాలయ్యాయి. సీఎం కేసీఆర్తోనే మా బతుకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే నాకు రూ.50వేల రుణమాఫీ చేసింది. మా గ్రామంలో నాతోపాటు మరో 30 మందికి రుణమాఫీ జరిగింది. ప్రస్తుతం త్రిఫ్ట్ పథకం ద్వారా 130 మందికి లబ్ధ్ది చేకూరుతున్నది. చేనేత మిత్ర పథకంలో నాకు, మరో వర్కర్కు కలిపి రూ.2500 బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. మేము నేస్తున్న వస్ర్తాలకు మార్కెట్లో ధర లేకున్నా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పథకాలతో కొంత లబ్ధి చేకూరనుంది. చేనేత మిత్ర మా కుటుంబాలకు అండగా నిలుస్తుంది.
– జెల్లా నరసింహ, నర్సింగ్భట్ల, నల్లగొండ మండలం
నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటుండగా, కేంద్ర సర్కారు మాత్రం నేతన్నను ఆగం చేస్తున్నది. జీఎస్టీ పేరుతో ఉన్నకాడికి దోచుకోవాలని చూస్తున్నది. ఇప్పటికే చేనేతపై 5శాతం జీఎస్టీ విధిస్తూ కార్మికుల జీవితాలను చీకట్లోకి నెట్టాలని చూస్తున్నది. ఇది చాలదన్నట్లు దీన్ని 12శాతానికి పెంచాలని నిర్ణయించింది. కానీ.. నేతన్నల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా నిలుపుదల చేసింది. కేంద్రం ఆదుకోకపోగా.. పన్నుల పేరుతో దోచుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.