భువనగిరి అర్బన్, జనవరి 29 : భువనగిరి పట్టణంలోని బీచ్మహాళ్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. డీఈఓ కె.నారాయణరెడ్డి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరిశీలన సాయంత్రం వరకు కొనసాగింది. గణితం, ఫిజిక్స్, జీవశాస్త్రం, సాంఘీకశాస్త్రం, ఇంగ్లిష్ విభాగాల్లో పదోన్నతి పొందేందుకు 250 మందికి అవకాశం ఉండగా, సర్టిఫికెట్ల పరిశీలనకు సుమారు 650 నుంచి 700 మంది ఉపాధ్యాయులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు. కాగా, టీచర్ల బదిలీలకు సంబంధించి జిల్లాలో మొత్తం 1,374 ఖాళీలు ఉన్నాయి.
నేటితో ముగియనున్న గడువు
జిల్లాలో ప్రారంభమైన టీచర్ల బదిలీల దరఖాస్తులు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. మొదటి రోజు అంతంత మాత్రమే దరఖాస్తు చేసుకోగా, రెండో రోజు భారీగా వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుండడంతో మరింత హడావిడి ఉండే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రిపరెన్షియల్ కేటగిరీ(వ్యాధులు కల్గినవారు) టీచర్లు వారి వ్యాధులకు సంబంధించిన పరిశీలన కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నుంచి సంబంధిత పత్రాలను దరఖాస్తుతోపాటు సమర్పించుకున్నారు.