యాదాద్రి, డిసెంబర్ 30 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదా ల వద్ద 108 బంగారు పుష్పా లు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామి వారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో భాగంగా సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు స్వామివారి ఆర్జిత సేవలు అంతరంగికంగా జరుపగా, ఉభయ దర్శనాలు నిలిపివేశారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు.
అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం ఘనంగా నిర్వహించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. గోదాదేవి రంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు చేశారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.17,65,894 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.