బొడ్రాయిబజార్, జనవరి 8 : సూర్యాపేట మున్సిపాలిటీ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఓ వైపు మెడికల్ కళాశాల, మరో వైపు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రెండు మినీ ట్యాంక్బండ్లు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో. ఇక సుందరంగా మారనున్న ప్రధాన రహదారి కూడా సూర్యాపేటకు మైలురాయిలా నిలువనున్నది. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని సూర్యాపేట పట్టణాన్ని మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా కేంద్రంగా మార్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు పట్టణానికి రావడంతో గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. అలాగే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు సైతం తమ యూనిట్లను జిల్లా కేంద్రంలో నెలకొల్పాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు, వివిధ రకాల వ్యాపారులు, వినియోగదారులు, జీవనోపాధి కోసం వచ్చేవారు, వారు ఉపయోగించే వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే స్థితికి చేరుకుందంటే పట్టణానికి ప్రజల తాకిడి ఏ విధంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో రోడ్ల విస్తరణకు మంత్రి జగదీశ్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని పాత జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పూనుకున్నారు. ఆయనే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లా కేంద్రానికి తలమానికంగా నిలువనున్న ప్రధాన రహదారి విస్తరణ పనులను వేగవంతంగా జరిపిస్తున్నారు. రూ.32 కోట్లతో పుల్లారెడ్డి చెరువు నుంచి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇప్పటికీ మురుగు కాల్వల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రోడ్డు మధ్యలో డివైడర్ను ఏర్పాటు చేసి అందమైన పూల మొక్కలు ఉంచారు. అలాగే రోడ్డుకు రెండువైపులా బాటసారులు వెళ్లేందుకు వీలుగా ఫుట్పాత్ను నిర్మించి గార్డెన్స్ పోల్స్ ఏర్పాటు చేశారు.
రోడ్డు మధ్య డివైడర్లో పూల మొక్కలతో పాటు అందమైన వెలుగులు విరజిమ్మేలా సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. పుల్లారెడ్డి చెరువు నుంచి పీఎస్ఆర్ సెంటర్ వరకు, పోస్టాఫీసు నుంచి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వరకు రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రహదారిపై పీఎస్ఆర్ సెంటర్, ధర్మభిక్షం చౌరస్తా పనులు పురోగతిలో ఉండగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న కోర్టు చౌరస్తాలోని ఫౌంటెయిన్, కర్నల్ సంతోష్బాబు విగ్రహం ఈ రహదారికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే జిల్లా కేంద్రంలో వ్యాపారపరంగా వ్యాపారులకు, రవాణా పరంగా ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుంది. కోట్లాది రూపాయలతో సూర్యాపేటను మంత్రి సమగ్ర అభివృద్ధి చేయడంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణానికి తలమానికంగా ప్రధాన రహదారి
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి దిన దినాభివృద్ధి చెందుతున్నది. జరుగుతున్న అభివృద్ధికి తగినట్లుగా రోడ్లు ఉండాలని భావించిన మంత్రి గత ప్రభుత్వాలు చేయలేని రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టి ప్రధాన రహదారిని విస్తరించి సుందరీకరిస్తున్నారు. సరికొత్త హంగులతో మహా నగరాలకు తీసిపోని విధంగా ఈ ప్రధాన రహదారి ప్రజలకు కనువిందు చేయనున్నది.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట
నెల రోజుల్లో ప్రధాన రహదారి పనులు పూర్తి
జిల్లా కేంద్రానికి తలమానికంగా నిలువనున్న ప్రధాన రహదారి విస్తరణ పనులు నెల రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పాటు మంచినీటి పైప్లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. మరో నెల రోజుల్లో మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ప్రధాన రహదారి సర్వంగా సుందరంగా రూపుదిద్దుకోనున్నది. జిల్లా కేంద్రమైన నాటి నుంచి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో సూర్యాపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. ప్రజలంతా జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– పి.రామానుజులరెడ్డ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
రోడ్డు విశాలంగా మారింది
గతంలో ఇరుకుగా ఉన్న రోడ్డును చూసి ప్రస్తుతం విశాలంగా మారిన సూర్యాపేట ప్రధాన రహదారిని చూస్తే హైదరాబాద్ మాదిరిగా అనిపిస్తుంది. రోడ్డుపై డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలు పెంచుతున్నారు. సెంట్రల్ లైటింగ్, గార్డెన్పోల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. ఎక్కువగా హైదరాబాద్లోనే ఇలాంటి రోడ్లను చూస్తుంటాం. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయి.
– పాల్వాయి జ్యోత్స్న, సూర్యాపేట