చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 8 : ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. వంద రోజుల్లోనే పాత పరిస్థితులు తిరగబడ్డాయి. ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నది. తాగునీటికి కటకట ఏర్పడింది. లక్షల ఎకరాలు ఎండిపోయాయి. అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటన్నింటికీ కారణమైన కాంగ్రెస్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో బొంద పెట్టాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని దామెర గ్రామంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ, అందరికీ రైతుబంధు, మహిళలకు నెలకు రూ.2,500 ఎటు పోయాయని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని మళ్లీ తుక్కుగూడ సభలో రాహుల్ ప్రకటించడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీటిని అందించలేకపోతున్నదని, ఉన్న నీటిని వాడుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు అని దుయ్యబట్టారు. జిల్లాలో పంటలు ఎండిపోతుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 15రోజుల నుంచి కనిపించడం లేదన్నారు. జిల్లాలో మంత్రులు రైస్ మిలర్ల వద్ద అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీలో కప్పం కడుతూ పదవులు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం ధర పడిపోయిందని రైతులు బాధపడుతున్నారని తెలిపారు. ఎండిన పంటలకు తక్షణమే రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, అన్ని పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. వీటన్నింటిపై గ్రామాల్లో కార్యకర్తలు చర్చ పెట్టాలని, రైతులకు, మహిళలకు కాంగ్రెస్ మోసపు హామీలను విడమరిచి చెప్పాలని సూచించారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు
బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమావేశం ఏర్పాటు చేసిన ఫంక్షన్హాల్ నిండిపోవడంతో కార్యకర్తలు చాలా మంది బయటే ఉండిపోయారు. నాయకుల ప్రసంగాలు శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి.
మూడు నెలల్లోనే పదేండ్ల వెనక్కి.. ; బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మూడు నెలల్లోనే పదేండ్ల వెనుకకు వెళ్లిందని, ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. మండలంలోని దామెర గ్రామంలో సోమవారం జరిగిన పార్టీ మునుగోడు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అవి చేయలేకపోయారన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రజల వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్యాలని, కేసీఆర్ ప్రవేశపెట్టిన చేనేత పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలందరికీ రూ.2500, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేశాకే ఓట్లు అడగాలని సవాల్ చేశారు. లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రైతులను చెప్పుతో కొడుతానని మంత్రి అనడం కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట అని, వారికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్పై రేవంత్రెడ్డి వీధి రౌడీలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే సీఎం రేవంత్రెడ్డి బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిన పనులేవో చెప్పాలన్నారు. గుడులు, మతం పేరు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. మునుగోడు మా జీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి
ఈ ప్రాంత అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు. భువనగిరి ఖిలాపై ఎగిరేది గులాబీ జెండే. ఇందుకోసం ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేద్దాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అదే బీఆర్ఎస్కు కలిసి వస్తుంది.
– ఎలిమినేటి సందీప్రెడ్డి, జడ్పీ చైర్మన్, యాదాద్రి భువనగిరి
బలహీన వర్గాల అభ్యర్థ్ధి మల్లేశ్ను గెలిపించాలి
బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు సీటును మూడు సార్లు బీసీలకు కేటాయించి బలహీన వర్గాలకు అండగా నిలిచింది. ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే బలహీన వర్గాలకు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు. బలహీన వర్గాల అభ్యర్థి క్యామ మల్లేశ్ను అధిక మెజార్టీతో గెలిపించాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
గ్యారెంటీలను గాలికొదిలేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. హామీలను అమలు చేయకుండాప్రజలను మభ్యపెట్టాడానికి ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నది. అలాంటి వాటికి గులాబీ కార్యకర్తలు భయపడరు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ విజయం ఖాయం.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ పాలనలోనే తండాల అభివృద్ధి
బీఆర్ఎస్ పాలనలోనే తండాలు అభివృద్ధి చెందా యి. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యను తీసుకొచ్చింది. ప్రజలకు గత ఎన్నికల్లో చేసిన పొరపాటు తక్కువ కాలంలోనే అర్థమైంది. ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లేశ్ అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నారు.
– రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
సంక్షేమ పథకాలు అటకెక్కాయి
బోగస్ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను అటకెక్కించింది. సంక్షేమ పథకాలు ఎత్తివేయడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు రూ.2500 ఇచ్చాకే కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడగాలి. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాల అభ్యర్థి క్యామ మల్లేశ్ను గెలిపించాలి.
బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు స్పష్టమైన తేడా బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో మాటలు కోటలు దాటాయి. కానీ.. చేతలు గడప దాటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి క్యామ మల్లేశ్ విజయానికి కృషి చేయాలి.
– బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే
70 ఏండ్లు అధికారంలో ఉండి ప్రజలకు విషం ఇచ్చారు
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ప్రజలకు కనీసం మంచిస్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. రైతులను చెప్పుతో కొడుతామన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి.