సూర్యాపేట, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. అక్రమాల్లో భాగస్వామ్యమైన సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్యతోపాటు కోదాడకు చెందిన నీలా సత్యనారాయణపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చివ్వెంల మండలం వల్లభాపురం వద్ద ఉన్న జగన్మాత పారాబాయిల్డ్ రైస్ మిల్లులో స్టాక్ సరిగా ఉండడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. సోమ నర్సయ్యకు చెందిన తిరుమలగిరి మండలంలోని సంతోష్ రైస్ మిల్లులో గత మూడు సీజన్లకు చెందిన రూ.90 కోట్ల విలువ చేసే 41,365 మెట్రిక్ టన్నుల ధాన్యం, కోదాడ మండలం కొమరబండ వద్ద ఉన్న శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో రూ.64 కోట్ల విలువ చేసే 29,093 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారని చెప్పారు.
దాంతో సంతోష్ రైస్ మిల్లు యజమాని, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సోమనర్సయ్యతోపాటు శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ యజమాని నీలా సత్యనారాయణపై అధికారుల ఫిర్యాదుల మేరకు 406, 409, 420, 120బి,109 ఐసీసీ సెక్షన్ ఆఫ్ ఈసీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో కొన్ని నాన్బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయన్నారు.
నాగారం మండలం ఈటూరు వద్ద ఉన్న రఘురామ పారాబాయిల్డ్ రైస్ మిల్లులో సైతం 15 నుంచి 20 మంది అధికారులు, సిబ్బంది తనిఖీలు చేపటినట్లు సమాచారం. కానీ వాటిలో ఏమైనా అక్రమాలు జరిగాయా, ధాన్యం నిల్వలు ఉన్నాయా? అని సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారితోపాటు ఇతర అధికారులను సంప్రదించినా తమకు తెలియదని చెప్పడం గమనార్హం. కొద్ది సంవత్సరాలుగా రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం ఆయా మిల్లుల సామర్థ్యాన్ని బట్టి కేటాయిస్తూ వస్తున్నది.
సూర్యాపేట జిల్లాలో గత రెండు సీజన్ల నుంచి ధాన్యం తీసుకొని ఒక్క కిలో కూడా సీఆర్ఎంర్ ఇవ్వని మిల్లులు 6 ఉన్నాయి. వీటితోపాటు గతంలో సకాలంలో రైస్ ఇవ్వక డిఫాల్ట్ అయిన మిల్లులు 32 ఉన్నాయి. రెండు రోజులుగా జిల్లాలోని అలాంటి నాలుగు మిల్లులపై అధికారులు తనిఖీలు చేపట్టి రెండింటిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు మిల్లులు ఉండడం, రెండింటిలోనూ కేటాయించిన ధాన్యం లేనట్లు తెలిసింది. దాంతో రెండు మిల్లులు సీజ్ కాకుండా ఒక మిల్లులోని స్టాక్ను మరో మిల్లులో చూపిస్తున్నట్లు సమాచారం.