యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం జరిపారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది. ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులతో సువర్ణ పుష్పార్చన జరిపించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళ స్వామివారికి తిరువీధిసేవ, దర్భార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రివేళ స్వామివారికి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 9వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.18,09,710 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.