యాదాద్రి, అక్టోబర్ 19 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో బుధవారం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం వైభవంగా జరిగింది. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు జరిపించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవ వైభవంగా చేపట్టారు. స్వామివారికి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖమండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానకు రూ.12,03,846 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సన్నిధిలో ప్రముఖులు..
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు, డైలాగ్ రైటర్ కోన వెంకట్, ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణపుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.