యాదగిరిగుట్ట, ఆగస్టు 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్య సుదర్శ నారసింహ హోమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రధానాలయంలోని కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులను అధిష్టించి సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ నారసింహ హవనం చేశారు. హోమంలో పాల్గొంటే ఇలలోక సుఖాలు, పరలోక మోక్షాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీ సమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవను ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.11,43,913 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. బుధవారం కొండపైకి చేరుకున్న ఆయన మొదటగా స్వయంభూ పంచనారసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకులు రాజన్బాబు స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఇల వేల్పయిన స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని అభిప్రాయపడ్డారు. ఆయన వెంట జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, దివ్య డైమండ్స్ అధినేత మహేంద్రబాబు, ఆయాన్, అనిల్ చింత, వివిధ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్, బోజరాజు ఉన్నారు.