తిరుమలగిరి, నవంబర్ 7 : గొల్లకురుమలకు జీవనోపాధిని మెరుగుపర్చడమే కాకుండా మాంసం ఉత్పత్తిలో రాష్ర్టాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు.ఇప్పటివరకు ప్రభుత్వం రెండు విడుతల్లో గొర్రెల యూనిట్లు పంపిణీ చేయగా జిల్లాలో 18,096 మందికి అందాయి. వీటి కోసం సర్కారు రూ.230.82 కోట్లు వెచ్చించింది. 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును యూనిట్గా ఇవ్వగా ప్రస్తుతం మూడింతలు పెరిగాయి. ఎప్పటికప్పుడు గొర్రెలను విక్రయిస్తూ గొల్లకురుమలు ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. గొర్రెలకు ప్రభుత్వం ఉచితంగా బీమా కల్పించడం, పశుగ్రాసానికి ఏర్పాటు చేయడం ఎంతో తోడ్పాటునిస్తున్నది. ఒకప్పుడు ఇతర పనుల మీద ఆధారపడి జీవనం సాగించిన వారు ప్రభుత్వం కల్పించిన గొర్రెల యూనిట్లతో సొంతంగా ఉపాధి పొందుతున్నారు.
కుల వృత్తుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. ఈ పథకం ద్వారా అర్హులందరికీ 21 జీవాలు అందించడంతో వాటిని పోషించుకొని గొర్రెల పెంపకందారులు జీవనోపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. గొర్రెల సంపద, మాంసం ఉత్పత్తి పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా 75శాతం సబ్సిడీతో ఒక్కో కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేశారు. జీవాలకు ఉచిత బీమా సౌకర్యం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు ఇవ్వడంతోపాటు పశుగ్రాసం విత్తనాలు సైతం అందజేశారు. సూర్యాపేట జిల్లాలో 280 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లోని 44,943 మంది సభ్యులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశారు. మొదటి, రెండో విడుతల్లో రూ.230.82 కోట్లు ఖర్చు చేసి 18,096 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. అవి ఇప్పుడు మూడింతలయ్యాయి. ఈ పథకంతో గొర్రెల కాపరులు జీవనోపాధి పొందడంతోపాటు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. గతంలో తమను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెలు అందజేసి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని గొల్లకురుమలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదికి లక్ష ఆదాయం వస్తుంది
మాకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. మొదటి విడుతలో నాకు గొర్రెల యూనిట్ వచ్చింది. మంచిగా సాదుకున్నా. ఇప్పుడు 60 గొర్రెల మంద అయ్యింది. వాటి విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉంటుంది. పొట్టేళ్లు అమ్మడం ద్వారా ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ఆదాయం వస్తున్నది. వాటితో జీవనోపాధి పొందడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందుతున్నా. ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత గ్రామాల్లో చాలా మంది పేద గొల్లకురుమలు జీవనోపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుండడం పట్ల ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మూడోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలి.
– బోయిని కొమరమల్లు యాదవ్, తిరుమలగిరి
మంద మూడింతలు అయ్యింది
రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమలకు సబ్సిడీ గొర్రెలు ఇచ్చి ఆదుకున్నది. వాటిని మంచిగా సాదుకుంటున్నం. ప్రభుత్వం ఇచ్చిన 21 గొర్రెలకు ఇప్పుడు మూడింతలు అయినయ్. ప్రతి సంవత్సరం పొట్టేళ్లను అమ్ముకుంటూ మంచి లాభాలు పొందుతున్నాం. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మాకు గొర్రెల మంద అయ్యింది. లేకుంటే ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ వచ్చినంకనే అందరి బతుకులు బాగుపడుతున్నయ్.
– గంటా సింహాద్రి యాదవ్, వర్ధమానుకోట, నాగారం మండలం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ద్వారా నాకు 20గొర్రెలు ఇచ్చారు. నేను, నా భార్య కలిసి వాటిని కాసుకుంటున్నాం. ప్రస్తుతం 35 గొర్రెలు అయ్యాయి. చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే యాదవుల అభివృద్ధి సాధ్యమైంది. మా కుటుంబంలో ఆరు ఓట్లు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గాదరి కిశోర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటాం.
– మెంతబోయిన బక్కయ్యయాదవ్, తుంగతుర్తి