యాదాద్రి, జనవరి 5 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. స్వయంభూ నారసింహుడికి గురువారం నిత్య కైంకర్యాల అనంతరం అమ్మవారికి మార్గళి పూజలో భాగంగా అర్చకులు, పారాయణదారులు 21వ పాశురాలను పఠించారు. అనంతరం స్వామి వారి అలంకార సేవలు ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. యాదాద్రీశుడి నిత్యోత్సవాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు శయనోత్సవం వరకు స్వామి వారి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం వెన్నముద్ద కృష్ణుడిగా..
యాదాద్రి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అలంకార సేవలు ఘనంగా నిర్వహించారు. ఉదయం వెన్నముద్ద కృష్ణుడిగా యాదాద్రీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వెన్నముద్ద కృష్ణుడిగా అలంకరించి ప్రత్యేక సేవపై అధిష్టింపజేసి సేవోత్సవాన్ని నిర్వహించారు. సేవోత్సవంలో దివ్య ప్రబంధ పఠనం కొనసాగించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చక బృందం దివ్య ప్రబంధ పఠనం చేస్తుండగా అలంకార సేవలను ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అలంకార సేవలను వీక్షించారు.
సేవ విశిష్టత : శ్రీకృష్ణ అవతార క్రమంలో ఎన్నో లీలలను భక్త కోటికి అందించిన తీరు, భక్తులు ఆనందించిన తీరులు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి వెన్న కృష్ణుడిగా భగవానుడు చూపిన దివ్యమైన తత్వం. మన రక్షణకు నింతరం తాను జాగరూకుడై ఉండి ప్రకృతి మాయలో మనం పడిపోకుండా కాపాడే స్వరూపంగా వెన్న కృష్ణుడు పేర్కొన్నాడు. వెన్న తొమ్మిది దశలు దాటిన పిదప ఏర్పడే పదార్థం. జీవుడు కూడా తొమ్మిది దశలు దాటాక భగవానుడికి ప్రతిపాత్రుడు కాగలడని పూరాణాలు తెలుపుతున్నాయి. ఎంతో ఆపూర్వమైన వేదాంత అర్థాన్ని ఈ అలంకార సేవలో భక్తకోటి దర్శించి తరించవచ్చు.
రాత్రి కాళీయమర్ధనుడిగా..
ఆధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రధానాలయంలో రాత్రి వేళ లక్ష్మీనరసింహ స్వామిని కాళీయమర్ధనుడిగా అలంకరించి ఊరేగించారు. ద్రావిడ ప్రబంధ సేవా కాలంలో పారాయణిక స్వాములచే సేవోత్సవం చేపట్టారు. వేడుకను అర్చకులు ఘనంగా నిర్వహించారు. కాళియమర్ధనుడిగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి అలంకార సేవకు హారతినిచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
సేవ విశిష్టత : అధ్యయనోత్సవాల్లో నిర్వహించే అలంకార సేవలు భక్తకోటికి భగవానుడి రక్షణ తత్పరతను తెలియజేస్తున్నాయి. గరుత్మతుండికి భయపడిన కాళీయుడు యుమనా నదిలో తల దాచుకుని నదిలోని జలాలను విషపూరితం చేసి, నందవ్రజంలోని గోవులను, గోప బాలకులను తన విషంతో సంహరించాలనుకోగా శ్రీకృష్ణుడు కాళీయుని మదనాన్ని అణచి యమునా జలాలను ఆస్వాద యోగ్యాలను ఏర్పరచి తన భక్తులను రక్షిస్తాడు. తనను శరణు వడిస సర్వవిధ దుఃఖాల నుంచి రక్షించెదనని స్వామివారు కాళీయమర్ధన అలంకార సేవలో దర్శన భాగ్యం కల్పించారు.
వైభవంగా సువర్ణ పుష్పార్చన
స్వామి వారి సన్నిధిలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామి వారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. తెల్లవారు జూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఖజానాకు రూ.16,94,998 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.