మోత్కూరు, ఫిబ్రవరి 17 : విద్యార్థులు నెగిటివ్ ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని శ్రద్ధగా చదువుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే సూచించారు. శనివారం మోత్కూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ అవగాహన తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలను పెద్దగా ఊహించుకొని ఆందోళన చెందొద్దన్నారు. పాజిటివ్ ఎనర్జీని బయట పెడితేనే సక్సెస్ అవుతారని సూచించారు. ఒలింపిక్స్లో 28 గోల్డ్ మెడల్స్ సాధించిన అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫేల్ఫ్స్ తన ఏడు సంవత్సరాల వయస్సులోనే స్విమ్మింగ్ మొదలు పెట్టి తన గమ్య స్థానం చేరుకోవడం కోసం కష్టపడ్డాడని వివరించారు. చెయ్యికి గాయమైనా ప్రాక్టీస్ ఆపకుండా ముందుకు సాగి ప్రపంచ రికార్డులకు ఎక్కారని చెప్పారు.
కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని, పరీక్షలు సమీపిస్తున్నందున బాగా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లక్ష్య సాధనలో అనుసరించాల్సిన విషయాలపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంప నాగేశ్వర్రావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీఈఓ నారాయణరెడ్డి, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు జైపాల్రెడ్డి, యాదయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలి
విద్యార్థులు ఇంటర్నెట్ను విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. చెడు అంశాలకు దూరంగా ఉండాలి. పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా విషయ పరిజ్ఞానం పెంచుకోవచ్చు. విద్యార్థులు క్రీడా రంగంలోనూ రాణించాలి. మంచి ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణకు క్రీడలు దోహదపడుతాయి. నాయకత్వ, స్నేహపూర్వక లక్షణాలు అలవడుతాయి.
-రాజేశ్చంద్ర, డీసీపీ