మేళ్లచెర్వు, జూలై 16 : హాస్టల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు శివారులో బుధవారం చోటుచేసుకుంది. మండల కేంద్ర శివారులోని ఓ అద్దె భవనంలో గత ఐదేళ్లుగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల నడుస్తోంది. వాస్తవానికి ఇది హుజూర్నగర్ మండలానికి మంజూరు కాగా అక్కడ వసతి లేకపోవడంతో మేళ్లచెర్వు మండలం శ్రీనగర్ కాలనీ వద్ద నిర్వహిస్తున్నారు. కాగా గత రెండేళ్లుగా ఇక్కడ వసతి బాగానే ఉన్నా బోర్లు ఎండిపోయి నీటి ఎద్దడి నెలకొంది.
ప్రస్తుతం ఇక్కడ 468 మంది విద్యార్థులు ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నీటి సమస్య మరింత తీవ్రం కావడంతో బుధవారం విద్యార్థులు మేళ్లచెర్వు-కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్నానాలకు, వాష్రూంలకు నీళ్లు రావడం లేదని, ప్రిన్సిపాల్కు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు.