నకిరేకల్, ఏప్రిల్ 29 : నకిరేకల్ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పదోతరగతి పరీక్షా ఫలితాల రోజే ఓ విద్యార్థి మృతి చెందడంతో నకిరేకల్ మండలం, పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన మన్నెం సైదులు, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మన్నెం జశ్వంత్(15) నకిరేకల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు రాశాడు. కొన్ని గంటల్లో ఫలితాలు వస్తాయని ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఇంటిముందు నాగళ్లతో పాటే ట్రాక్టర్ను ఉంచిన తండ్రి మన్నెం సైదులు ఓ రైసు మిల్లులో పనికి, తల్లి మల్లీశ్వరి కూలికి వెళ్లారు. ఉదయం 9.30 గంటల సమయంలో జశ్వంత్ ఇంటిముందు ఉన్న ట్రాక్టర్ను స్టార్ట్ చేయాలనుకున్నాడు. ట్రాక్టర్ గేరులో ఉన్న విషయం తెలియక ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో ట్రాక్టర్ ఇంజిన్ సెల్ఫ్ మోటార్ రెండు ఫేజ్లను కలిపి రేంచ్ పానాలతో డక్కా కొట్టాడు.
ఒక్కసారిగా స్టార్ట్ అయిన ట్రాక్టర్ అకస్మాత్తుగా జశ్వంత్ పై నుంచి వెళ్లింది. నాగళ్లు కిందకు ఉండటంతో ట్రాక్టర్ పెద్ద టైరు కింద పడిన జశ్వంత్ను కొంతమేరకు లాక్కెళ్లింది. దీంతో జశ్వంత్ ట్రాక్టర్, నాగళ్ల మధ్య చిక్కుకుని తలకు, ఇతర శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అటునుంచి వెళ్తున్న స్థానికుడు బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఒకరు ట్రాక్టర్ స్టార్ట్ చేసి నాగళ్లను పైకి ఎత్తి జశ్వంత్ను పక్కకు తీశారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆంబులెన్స్ సాయంతో నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జశ్వంత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చిన్నతనంలోనే క్రమశిక్షణతో చదువుకుంటూ, పనులు చేస్తూ గారాబంగా తిరిగే జశ్వంత్ తమను విడిచి వెళ్లాడంటూ నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువుర్ని కంటతడిపెట్టించింది. బుధవారం విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జశ్వంత్కు 470 మార్కులు వచ్చాయి. మృతుడు జశ్వంత్ తండ్రి మన్నెం సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు.