– ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నల్లగొండ సిటీ, జూన్ 04 : నల్లగొండ జిల్లా కనగల్లు మండలం తుర్కపల్లి గ్రామంలో గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మహిళా డిక్లరేషన్ అమలు, మహిళల సమస్యలు, సంక్షేమ పథకాలపై సమగ్ర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ములుగు మహిళా డిక్లరేషన్ పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే వాటిలో చాలా వరకు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని అన్నారు. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికీ అధిక వడ్డీలకు అప్పులు తీసుకునే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో మహిళలకు 25 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. చదువుకున్న విద్యార్థినులకు ల్యాప్టాప్లు, స్కూటీలు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ విషయంపై కూడా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళలను లక్షాధికారులుగా చేస్తామని చెప్పి, మహిళా సంఘాలకు తగిన ఆర్థిక సహాయం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీల అమలుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా డిక్లరేషన్లో ప్రకటించిన పథకాల అమలుకు అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించకుండా హామీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
మహిళల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక సాధికారత కోసం జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వేలు నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసే వరకు ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె. సుల్తానా, మహిళా నాయకురాళ్లు ఆదిమల్ల మారెమ్మ, బయలు యాదమ్మ, మీనమ్మ, లక్ష్మి, ప్రశాంతి, దుర్గమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.