హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు పటిష్ఠ మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని డ్రాఫ్ట్ మార్గదర్శకాలను సిద్ధం చేసిన త్రిసభ్య కమిటీ, సోమవారం నుంచి బుధవారం వరకు తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలతో సంప్రదింపులు జరపనున్నది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్చార్డీ)లో మార్గదర్శకాల రూపకల్పన కోసం మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించనున్నది.
రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థుల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, అడిషనల్ డీజీ స్వాతిలక్రాతో కూడిన త్రిసభ్య కమిటీ, పటిష్ఠ మార్గదర్శకాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపి, డ్రాఫ్ట్ మార్గదర్శకాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే.. తుది మార్గదర్శకాలు విడుదలకానున్నాయి.