ఏఎమ్మార్పీ ఎగువ భాగంలోని బీడు భూములకు సాగు నీరందించేందుకు రూపొందించిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పూర్తికి స్వరాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పాలకులు ప్రారంభించి వదిలేసిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేసీఆర్ సర్కారు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తూ వస్తున్నది. ప్రాజెక్టు డిజైన్లోని లోపాలను సరిదిద్దుతూ వేగంగా పనులను కొనసాగిస్తున్నది. నిర్మాణంలో ప్రధానమైన అప్రోచ్ కెనాల్, సొరంగ మార్గం, పంప్హౌస్, సర్జ్జిఫూల్, సిస్టర్న్, బ్రాహ్మణ వెల్లెంల జలాశయం పూర్తవడంతో ఇటీవల ట్రయల్ రన్ను సైతం విజయవంతంగా నిర్వహించింది. ఉదయసముద్రం నుంచి ఓపెన్ కెనాల్తోపాటు సొరంగమార్గం, పంప్హౌస్ల నిర్మాణం పూర్తిచేసి రెండు దఫాలుగా మోటర్లను రన్ చేసింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటిని ఎత్తిపోయడం జరిగింది. తమ కలల ప్రాజెక్టు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్తి కావస్తుండడంతో ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే 20 (నమస్తే తెలంగాణ)/ నార్కట్పల్లి : ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా మిగులు జలాల ఆధారంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల బహుళార్థసాధక ప్రాజెక్టు (యూఎస్ఎల్ఐఎస్)కు రూపకల్పన చేశారు. లక్ష ఎకరాలకు సాగునీటితోపాటు 107 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. నల్లగొండ సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి తరలించాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ద్వారా నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దాంతోపాటు ఈ మండలాల్లోని 107 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రాజెక్టును డిజైన్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2007 సెప్టెంబర్ 4న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రూ.699 కోట్లతో అంచనాలు రూపొందించినప్పటికీ రూ.483.95 కోట్లతో ఈపీసీ ద్వారా పనులను మైటాస్ సంస్థ దక్కించుకుంది. వాస్తవంగా దీన్ని 2012 ఆగస్టులోనే పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. అప్పటి పాలకులు దీన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దాంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. స్వరాష్ట్రంలో ప్రాజెక్టుపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ పునఃసమీక్షించి 2015 డిసెంబర్లో రూ.518 కోట్లతో అంచనా వ్యయాన్ని సవరించింది. అయితే ప్రాజెక్టు డిజైన్లోని లోపాల వల్ల సొరంగమార్గంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని సరిచేస్తూ పనులను తెలంగాణ సర్కార్ కొనసాగించింది. పెరిగిన ధరలు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో 2021 సెప్టెంబర్లో మరోసారి అంచనాలు సవరించింది. మొత్తం వ్యయాన్ని రూ.674.67 కోట్లుగా నిర్ధారిస్తూ వచ్చే ఏడాది మార్చి 31నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని డెడ్లైన్ విధించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన నియోజకవర్గానికి ఆయువుపట్టు లాంటి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారుల సహకారంతో ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నిధులు, ఇతర అవసరాలపై సీఎం కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొస్తున్నారు.
ఎస్ఎల్బీసీ ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా పానగల్ ఉదయ సముద్రానికి వచ్చే కృష్ణా జలాలను బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. పానగల్ ఉదయ సముద్రం నుంచి 6.90 కిలోమీటర్ల ఓపెన్ కాల్వ తవ్వి అక్కడి నుంచి పంపుహౌజ్ వరకు 10.675 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని తరలించనున్నారు. ఇప్పటికే ఓపెన్ కెనాల్తోపాటు సొరంగ మార్గం పనులు పూర్తయ్యాయి. నార్కట్పల్లి మండ లం చౌడంపల్లి శివారులో సర్జిపూల్ నిర్మించి పంపుహౌజ్ను ఏర్పాటు చేశారు. సర్జిపూల్, పంపుహౌజ్ పనులు కూడా పూర్తయ్యాయి. 0.3టీఎంసీల సామర్థ్ధ్యంతో బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేశారు. చౌడంపల్లి వద్ద పంపుహౌజ్లో 16 మెగావాట్ల సామర్థ్ధ్యంతో రెండు మోటర్ల ద్వారా నీటిని 1.12కిలోమీటర్ల ఎగువన నిర్మించిన బ్రా హ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎత్తిపోయాల్సి ఉంది. ఒక్కో మోటరు ద్వారా 459 క్యూసెక్కుల నీటిని పంప్ చేసేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద 6.5 కిలోమీటర్ల పొడవుతో ఎడమ, 25.5 కిలోమీటర్ల పొడవుతో కుడి కాల్వను నిర్మించి సాగునీటిని అందించనున్నారు. రెండు కాల్వలు కలిపి ఇప్పటి వరకు 12.5 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. 256 కిలోమీటర్ల పొడవైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేసి బీడు భూములకు సాగునీటిని అందించాల్సి ఉంది. ప్రాజెక్టు కోసం మొత్తం 3,847 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1,525 ఎకరాలను పూర్తి చేశారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 433.90కోట్ల రూపాయలు వెచ్చించారు.
ప్రాజెక్టు పరిధిలో కీలకమైన అప్రోచ్ కెనాల్, సొరంగ మార్గం, పంప్హౌజ్, సర్జిఫుల్, సిస్టర్న్, బ్రాహ్మణ వెల్లెంల జలాశయం పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 3న తొలిసారిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యవేక్షణలో అధికారులు మోటర్లను రన్ చేసి నీటిని ఎత్తిపోసి ట్రయల్ రన్ నిర్వహించారు. తర్వాత రెండ్రోజుల వ్యవధితో మరోసారి రెండు గంటల పాటు విజయవంతంగా మోటర్లను నడిపి ఇబ్బందులు లేకుండా నీటిని ఎత్తిపోశారు. దాంతో ప్రాజెక్టులో ప్రధాన ఘట్టం విజయవంతంగా ముగియడంతో ఈ ప్రాంతంలో సంతోషం వ్యక్తమైంది. ట్రయల్ రన్ చూసేందుకు వందలాది మంది స్థానిక ప్రజలు ప్రాజెక్టు ప్రాంతానికి తరలివచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు ప్రజలు బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్లోకి వస్తున్న నీటిలో తడిసి కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్దతో తొలిసారి తమ భూమిపై కాలుమోపిన కృష్ణమ్మకు ఘన స్వాగతం పలికారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతులు పట్టి పూలు చల్లారు. ట్రయల్ రన్ పూర్తి కావడంతో తదుపరి పనులపై దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడించారు. కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యం చేస్తే సీఎం కేసీఆర్ సారథ్యంలో పూర్తి అవుతుండడం సంతోషంగా ఉన్నదన్నారు. ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధతో నిధులు విడుదల చేస్తున్న సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం ద్వారా ఏడు మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండలంలో 33,773 ఎకరాలకు, చిట్యాలలో 5,505, రామన్నపేటలో 2,496, కట్టంగూర్ మండలంలో 20,614 ఎకరాలకు, మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు మండలంలో 10,270 ఎకరాలకు, నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలంలో 24,469 ఎకరాలకు, తుంగుతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలంలో 2,784 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. వీటితోపాటు ఈ మండలాల్లోని 107 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కూడా రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇక ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పనులను వేగవంతం చేసి వచ్చే వానకాలం నాటికి తొలి దశలో కొంత ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకోసం భూసేకరణ ప్రక్రియతోపాటు మిగిలిన పనులను ముమ్మరం చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్తయి ట్రయల్ రన్ చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి సహకారం మరువలేనిది. ప్రాజెక్టు పూర్తి చేసిన అనంతరం కృష్ణా జలాలతో సీఎం కేసీఆర్ కాళ్లు కడుగుతాం. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో తనతోపాటు ఇక్కడి ప్రజలు నీళ్లల్లో తడిసి పరువశించాం. ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాల్వలతోపాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణంపై దృష్టి సారిస్తాం. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరిస్తున్న సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే
గతంలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను మధ్యలోనే ఆపేశారు. దాంతో ఇక ప్రాజెక్టు పూర్తి కాదనుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలుమార్లు ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పినప్పటికీ కాదేమో అనుకున్నాం. ఎట్టకేలకు ప్రాజెక్టు పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడంతో నాకు పక్కా నమ్మకం కుదిరింది. నీళ్లు తెప్పించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఇక మాలాంటి రైతులకు నీటి కష్టాలు తప్పినట్టే. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– అల్గుబెల్లి నాగిరెడ్డి, రైతు, నార్కట్పల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం పనులు పూర్తి చేసిన తరువాత తమకు ఓటు వేయమని గ్రామాల్లో తిరుగుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం నీళ్లు తెచ్చిండ్రు. ట్రయల్ రన్తో ఆ నీటిని చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. ప్రాజెక్టు పుణ్యాన ఇకపై మాకు ఎలాంటి కష్టాలు ఉండవు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా వ్యవహరించడం మాకు పెద్ద వరం. ఈ ప్రాజెక్టుతో బీడు భూములు కూడా సస్యశ్యామలం అవుతాయి.
– యానాల అశోక్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, నార్కట్పల్లి