Gurukulam Entrance | నల్లగొండ, జనవరి 11 : 2024-25 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడగించినట్లు సాంఘిక సంక్షేమ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల భిక్షమయ్యగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఓఈ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 తేదీ వరకు గడువు పెంచినట్లు భిక్షమయ్యగౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ సీఓఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో విద్యాబోధన చేస్తూ ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, క్లాట్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.