సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 21 : దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అగ్నివీర్లో ఉద్యోగాలు సంపాదించిన 43 మంది సైనికులు, వారి తల్లిదండ్రులను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్కరించారు. అనంతరం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. తమ పిల్లలను దేశరక్షణలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడం సాహసోపేత నిర్ణయమని ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని, విద్యాబుద్ధులతోపాటు సమాజంపై అవగాహన పెంచుకుంటూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.
పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్నారని, అరకొరగా చదివితే ఉద్యోగావకాశాలు రావడం కష్టమన్నారు. అంతా ఇంజినీర్లు, డాక్టర్లు అంటే సాధ్యపడదని, ఆసక్తి కలిగిన రంగాన్ని ఎంచుకొని రాణించాలన్నారు. రాష్ట్రంలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని.. ప్రస్తుతం నిరుద్యోగులంతా ఉద్యోగం సంపాదించే పనిలో బిజీగా ఉన్నారన్నారు. కష్టపడి చదివిన వారందరికీ ఉద్యోగావకాశాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
దేశ సరిహద్దులో పహారా కాస్తూ విదేశీ శక్తుల నుంచి మన దేశాన్ని కాపాడటం తమవంతు బాధ్యతగా విధులు నిర్వహించడానికి ముందుకొచ్చిన సైనికులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు వెంకట్రావ్, వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్లు కేశవ్ హేమంత్ పాటిల్, వీర జవాన్ సంతోష్బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్, ట్రైనర్ రాజేశ్, ద సోల్జర్ యూత్ ఫౌండేషన్ డైరెక్టర్ సుమన్, మాజీ సైనికులు పాల్గొన్నారు.