దేశ రాజకీయాల్లో గులాబీ శకం మొదలైందని, తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు, పీఏపల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గులాబీ జెండాతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ పథకాలు అమలవుతున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన పథకాలపై చర్చ జరుగుతుండడంతో అక్కడి పాలకుల దృష్టి తెలంగాణ మీదికి మళ్లిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతుండడంతో హస్తిన పీఠం కదులుతుందన్న భయం మోదీకి పట్టుకుందని, అందుకే తెలంగాణపై కక్షపూరితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. మోదీ సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో దారిద్య్రం గతం కంటే రెండు శాతం పెరిగిందని, 27 రాష్ర్టాల్లో ఇప్పటీకీ ఒక్క పూట పస్తులుంటున్నారని పేర్కొన్నారు. రాజవరం మొదటి మేజర్కు పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చిన ఘనత
సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ముఖ్యమంత్రుల జిల్లాగా పేరున్న నల్లగొండ జిల్లాలో టేలెండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మండిపడ్డారు. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రకటించుకున్న జానారెడ్డిని సైతం నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు ఓడించారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా జరిగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొన్నారు.
గుర్రంపోడు/ పీఏపల్లి, ఏప్రిల్ 3 : ‘మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది తిరుగులేని శక్తిగా మారింది. ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్లగొండలో టేల్ ఎండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పాలనాదక్షత పట్ల అవగాహన లేక కోట్లు కుమ్మరించి కాంగ్రెస్లో పదవులు తెచ్చుకున్నవారు సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చచ్చిన శవంతో సమానం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో, పీఏపల్లి మండలంలోని అంగడిపేట స్టేజీ వద్ద సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అంగడిపేటలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, గుర్రంపోడులో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎడమ కాల్వకు మొదటి మేజర్గా ఉన్న రాజవరం కింద వేలాది ఎకరాలను ఎండబెట్టిన ఘనత జానారెడ్డిదేనన్నారు. అందుకే ముఖ్యమంత్రి అవుతానని కలలు గన్న జానారెడ్డిని ఇక్కడి ప్రజలు వరుస ఎన్నికల్లో ఓడించారని తెలిపారు. రాజవరం మేజర్కు నీళ్లిచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్దేనని చెప్పారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, అంతర్గత రహదారుల నిర్మాణాలు, విద్యుదీకరణతో రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. 2014కు ముందు పాలమూరు నుంచి 14లక్షల మంది వలస వెళ్తే.. నేడు ఇతర రాష్ర్టాల నుంచి 30లక్షల మంది తెలంగాణకు వలస వచ్చి బతుకుతున్నారని అన్నారు.
మోదీ పాలించిన గుజరాత్లో రైతు బీమా, రైతుబంధు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని.. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటివి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టాయని చెప్పారు. దేశ రాజకీయాల్లో ప్రవేశించిన బీఆర్ఎస్లో చేరేందుకు ఇతర రాష్ర్టాల నేతలు బారులు దీరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ జీవితం మూడు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నదని, ఆయనను బలహీనం చేస్తే తెలంగాణ బలహీన పడినట్లేనని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన రూ.30 వేల కోట్లు రాకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని విమర్శించారు. గుర్రంపోడు ఆత్మీయ సమ్మేళనంలో ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్రావు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ, నాయకులు జలగం సదర్శన్రావు, పిల్లి అభినయ్, ఆవుల వెంకన్న, వెలుగు రవి, పృథ్వీరాజ్, ప్రవీణ్కుమార్, చంద్రమౌళి, నాగరాజు పాల్గొన్నారు.