నందికొండ, ఫిబ్రవరి 22 : నందికొండ మున్సిపాలిటీలోని చెత్త వాహనాలు కదలడం లేదు. డీజిల్కు డబ్బులు లేని కారణంగా రెండు నెలలుగా మున్సిపల్ కార్యాలయానికే పరిమితమయ్యాయి. దాంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు దుర్వాసనతో కాలం వెళ్లదీస్తున్నారు. కాలనీల్లోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడానికి వాహనాలు లేకపోవడంతో పారశుధ్య కార్శికులు కాలనీల్లోనే చెత్తను తగులబెడుతున్నారు. చెత్త వ్యర్థాల నుంచి వెద జల్లుతున్న విష వాయువులతో కాలనీల వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెత్త సేకరణకు సమస్య లేకుండే. కాలనీల్లోని చెత్తను వాహనాలు ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల నుంచి నందికొండ మున్సిపాలిటీని పాలకులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ నిర్వహణకు, మున్సిపల్ వాహనాలకు డీజిల్ను సమకూర్చడంలో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదని మున్సిపల్ సిబ్బంది, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో రావడం లేదు. దాంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను వివరణ కోరగా మున్సిపల్ చెత్త వాహనాల డీజిల్ కేటాయింపులకు సంబంధించి నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నదని తెలిపారు. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది జీతాలు కూడా చెల్లించాల్సి ఉన్నదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.