యాదాద్రి భువనగిరి, మే 10(నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని సర్కారు బడుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్ స్కూళ్లకు తీసిపోకుండా ర్యాంకుల పంట పడించారు. రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మార్కులు సాధించి ఔరా అనిపించారు. జనరల్ గురుకులాల్లో వందకు వంద శాతం మంది పాసయ్యారు. మోటకొండూరు, బీబీనగర్ బీసీ గురుకులాలు సైతం వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో 80.97 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 84.31శాతం, బాలురు 77.54 శాతంతో పాసయ్యారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 26వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 39 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి 15 మంది, జిల్లా పరిషత్ నుంచి ఒకరు, మోడల్ స్కూళ్ల నుంచి ఓ విద్యార్థి 10 జీఏపీ సాధించారు. మొత్తం 8,973 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 7,265 మంది పాసయ్యారు. గతేడాది 93.61శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి స్వల్పంగా తగ్గింది. ఇక 4,435 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 77.54 శాతంతో 3,439 మంది పాసయ్యారు. బాలికల విషయానికొస్తే 4,538 మంది పరీక్షలు రాయగా, 84.31శాతంతో 3,826మంది ఉత్తీర్ణత సాధించారు.
జనరల్ గురుకులాల్లో వంద శాతం ఉత్తీర్ణత
జనరల్ గురుకులాల్లో వందకు వంద శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. జిల్లాలో సర్వేల్, చౌటుప్పల్, రామన్నపేటలో జనరల్ గురుకులాలు ఉన్నాయి. మొత్తం 280 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 280మంది ఉత్తీర్ణత సాధించారు. 9 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
బీసీ గురుకులాల్లో 96.50 శాతం పాస్
జిల్లాలోని బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 96.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో మోటకొండూరు, బీబీనగర్, రాజాపేట, పోచంపల్లి మండలాల్లో బీసీ గురుకులాలు కొనసాగుతున్నాయి. మొత్తం 312మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 301మంది పాసయ్యారు. ముగ్గురు విద్యార్థులు 10 జీఏపీ సాధించారు. మోటకొండూరు, బీబీనగర్ గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, చీకటిమామిడి గురుకులంలో 90శాతం, దేశ్ముఖ్ బీసీ గురుకులంలో 96శాతం మంది పాసయ్యారు.
ఎస్సీ గురుకులాల్లో 86.83శాతం
జిల్లాలోని ఎనిమిది ఎస్సీ గురుకులాల్లో 86.83శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 539మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 468మంది స్టూడెంట్స్ పాసయ్యారు. ముగ్గురు 10 జీపీఏ సాధించారు. మైనార్టీ గురుకులాల్లో 93.80శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడు గురుకుల్లాలో 129మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 121మంది పాసయ్యారు. ముగ్గురికి 10జీపీఏ వచ్చింది.
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో..
జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉండగా 63.14శాతం ఉత్తీర్ణత సాధించారు. 369 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 233 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక మోడల్ స్కూళ్లలో 88.71శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 638 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 566మంది పాసయ్యారు. ఒక విద్యార్థి 10 జీఏపీ సాధించారు. లోకల్ బాడీ స్కూళ్లలో 72.72శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.