యాదగిరిగుట్ట, ఏప్రిల్28: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ ప్రధానాలయంలో నృసింహస్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం స్వామివారి అలంకార సేవతో యాగశాల ప్రవేశం జరిగింది. యాగశాలలో ద్వారా తోరణ పూజ, మూర్తికుంబారాధన, చతుస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూల మంత్ర హోమాలు నిర్వహించి నిత్యపూర్ణాహుతి వేడుకలను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యాజ్ఞిక బృందం, అర్చకులు, వేదపండితులు, పారాయణికుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం స్వామివారి ప్రధానాలయంలో నిత్యారాధన చేపట్టారు. జయంతోత్సవాల్లో భాగంగా సాయం ఆరాధన, నిత్యహవనం, లక్ష్మీనృసింహ సుదర్శన మూలమంత్ర హవనం, నిత్యపూర్ణాహుతి కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గరుడ వాహనంపై పరవాసు దేవ అలంకార సేవలో స్వామివారిని అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.
అలాగే పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డీఈవో నవీన్కుమార్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, ముఖ్య అర్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ ఏఈవో, పర్యవేక్షకులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.