యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. 33కోట్ల దేవతల సాక్షిగా లక్ష్మీ అమ్మవారిని వివాహమాడిన నరసింహ స్వామిని దివ్యవిమాన రథోత్సవంపై ఊరేగే తంతును ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు రథం ముందు పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలిహరణం చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపగ, మల్లిక వంటి పుష్పాలతో, చంద్రహారం, ముత్యాలు, మువ్వలు, వగడాలు, వివిధ కంఠాభరణాలతో ఆలంకరించారు. రథంలోని ఆ పరమాత్మను దర్శిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. రథం ఒక శరీరం, ఆ రథంలోని 24 అరలు మన ఇంద్రియాల వంటివని, రథంలో స్వామి అమ్మవార్లను అధిష్టించిన అర మన హృదయం వంటిందని ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే భగవంతుడు దర్శనమవుతారని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా మంగళవాయిద్యాల నడుమ భక్తులు భజనలు చేస్తూ కోలాటాలు వేశారు. జై నారసింహ.. జయజయ నారసింహ అంటూ స్మరించుకుంటూ రాత్రి వేళ తిరువీధుల వెంట ఊరేగించారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు.
తన్మయులైన భక్తులు
దివ్య విమాన రథోత్సవంలో శ్రీవారిని దర్శించుకుని తరించాలని తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు ఆనంద తన్మయులయ్యారు. పట్టు పీతాంబరాలు మెరిసిపోతున్న వజ్రవైడూర్యాలలో మెరిసిపోతుంగా శ్రీవారిని రథంపైన అధిష్టింపజేశారు. అంతకుముందు విశ్వక్సేనుడిని ఆరాధించి పూజలు చేశారు. తరలివస్తున్న లక్ష్మీనరసింహుడిని భక్తులు దర్శించుకున్నారు.
ఉదయం శ్రీవారి నిత్యారాధనల అనంతరం పారాయణికులచే చతుర్వేద పారాయణాలు, నిత్య హవనాలు, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు, లక్ష్మీ అష్టోత్తర నామ జపములను ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, వేద పండితులు, పారాయణికులు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గరుఢ వాహన సేవలో తీరువీధుల్లో ఊరేగించారు.
రథాంగ హోమం
శ్రీవారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం సాయంత్రం 5 గంటలకు రథాంగ హోమం నిర్వహించారు. యాజ్ఞికులచే రథబలి నిర్వహించారు. ఉత్సవమూర్తులను దివ్యవిమాన రథంపై వేంచేపు చేసి ఆరాధనలు గావించారు. భక్తుల దర్శనార్థం స్వామి, అమ్మవార్లను అలంకరించి రథారూఢులను గావించి తిరువీధిలో ఊరేగించారు. భక్తుల మంగళహారతులు, నామ సంకీర్తనలతో కోలాటాల మధ్య దివ్య విమాన రథోత్సవం కనులపండువగా సాగింది.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పాతగుట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, శ్రీరామ భక్తజన మండలి వారిచే భజన కార్యక్రమాలు, హైదరాబాద్కు చెందిన డీఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో భక్తి సంగీతం, కుమారి కొండపా లహరి బృందం వారిచే నృత్య ప్రదర్శన, యాదగిరిగుట్టకు చెందిన జెగిని హరీశ్ బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, బృందావని బృందంతో నృత్య ప్రదర్శన, ఒగ్గు శ్రీను బృందం వారిచే ఒగ్గు కథ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, సూపరింటెండెంట్ రామారావునాయక్, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్వామి వారిని సుమారు 20వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.25,93,574 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. శ్రీవారిని రాచకొండ అడీషనల్ సీపీ సత్యనారాయణ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శాస్ర్తోక్తంగా నిత్య తిరుకల్యాణోత్సవం
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి నిత్య తిరు కల్యాణోత్సవం శనివారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. స్వామి వారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది.
నేడు చక్రతీర్థం..
పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 6గంటలకు దేవతా ఉద్వాసన, శ్రీ పుష్పయాగం, డోలాహరణం నిర్వహిస్తారు.