నల్లగొండ ప్రతినిధి, మార్చి20 (నమస్తే తెలంగాణ): రానున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ఆత్మీయ సమ్మేళనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పది గ్రామాలకు ఆత్మీయ సమ్మేళనాలకు రంగం సిద్ధమైంది. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు నల్లగొండకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, యాదాద్రి జిల్లాకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సూర్యాపేట జిల్లాకు రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ను ఇన్చార్జిలుగా నియమించారు. వీరంతా ఇప్పటికే రంగంలోకి దిగి స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆత్మీయ సమ్మేళనాల షెడ్యూల్ను ఖరారు చేశారు.
ఉదయం నుంచి సా యంత్రం వరకు వీటిల్లో గ్రామాల వారీగా ముఖ్యులంతా మాట్లాడేలా… వారి సూచనలు, సలహాలు స్వీకరించేలా ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్లో మరింత సమన్వయం పెంపొందించడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సారథ్యంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో వీలైన చోట్ల మంత్రి జగదీశ్రెడ్డితో పాటు జిల్లా ఇన్చార్జిలు పాల్గొననున్నారు. ఇప్పటికే నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల షెడ్యూల్ ఖరారైంది. మునుగోడుకు సంబంధించి నేడు తుది షెడ్యూల్ రానున్నట్లు తెలిసింది. మంగళవారం నుంచి నకిరేకల్, నాగార్జునసాగర్లలో ఆత్మీయ సమ్మేళనాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పది గ్రామాలు ఒక యూనిట్ చొప్పున ఒక్కో మండలంలో రెండు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు ఇలా కొనసాగనున్నాయి.
నకిరేకల్ నియోజకవర్గం : మార్చి 21, 24 తేదీల్లో రామన్నపేట మండలం. మార్చి 23, 24 తేదీల్లో చిట్యాల, మార్చి 25, 27న నార్కట్పల్లి, మార్చి31, ఏప్రిల్ 5న కట్టంగూర్, ఏప్రిల్ 2,10 తేదీల్లో నకిరేకల్, ఏప్రిల్ 3,8 తేదీల్లో కేతేపల్లి మండలం.
నాగార్జునసాగర్ నియోజకవర్గం : మార్చి 21,24 తేదీల్లో త్రిపురారం, 23,25 తేదీల్లో తిరమలగిరి(సాగర్), 27 హాలియా రూరల్, 29న హాలియా మున్సిపాలిటీ, 28,31 తేదీల్లో నిడమనూర్, ఏప్రిల్ 1, 4తేదీల్లో గుర్రంపోడు, ఏప్రిల్ 2,5తేదీల్లో పెద్దవూర, ఏప్రిల్ 7న మాడ్గుపల్లి, ఏప్రిల్ 9న నందికొండ మున్సిపాలిటీ.
నల్లగొండ నియోజకవర్గం : మార్చి 26, ఏప్రిల్1,4 తేదీల్లో కనగల్, మార్చి 27, ఏప్రిల్ 2న తిప్పర్తి, మార్చి28 ఏప్రిల్3,6 తేదీల్లో నల్లగొండ రూరల్, ఏప్రిల్ 5న మాడ్గుపల్లి, ఏప్రిల్ 8,9,10 తేదీల్లో నల్లగొండ మున్సిపాలిటీ.
మిర్యాలగూడ నియోజకవర్గం : మార్చి 24న మాడ్గులపల్లి, మార్చి25న అడవిదేవులపల్లి, మార్చి 26న వేములపల్లి, ఏప్రిల్ 1,2 తేదీల్లో దామరచర్ల, మార్చి 27, ఏప్రిల్ 5న మిర్యాలగూడ క్లస్టర్-1, మార్చి 28, ఏప్రిల్ 6న మిర్యాలగూడ క్లస్టర్-2, మార్చి 29, ఏప్రిల్7 తేదీల్లో మిర్యాలగూడ క్లస్టర్-3.
దేవరకొండ నియోజకవర్గం : ఏప్రిల్ 3న పీఏపల్లి, ఏప్రిల్ 5న డిండి, ఏప్రిల్ 7న కొండమల్లేపల్లి, ఏప్రిల్ 9న నేరడుగొమ్ము, ఏప్రిల్ 11న చందంపేట, ఏప్రిల్13న దేవరకొండరూరల్, ఏప్రిల్ 16న చింతపల్లి, ఏప్రిల్ 18న దేవరకొండ మున్సిపాలిటీ.
పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సందేశం : ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతం కావాలని కోరుతూ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ అధినేత కేసీఆర్ సందేశానిచ్చారు. ఈ సందేశంలో ఉద్యమం నాటి రోజుల్లో పార్టీ ప్రారంభం నుంచి పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ రాష్ట్ర సాధనతో పాటు నేటి అద్భుత అభివృద్ధ్దిని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో దేశం బాగు కోసం సాగాల్సిన పోరులో పార్టీ శ్రేణుల కర్తవ్యాన్ని హితబోధ చేశారు. సందేశంలోని కొంతభాగం ఇలా సాగింది..
తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ.
ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నటికీ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం! ఇది ఎన్నికల సంవత్సరం. నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజస్కందాలపైనే ఉంది. సాహాసమే ఊపరిగా సాగుతున్న ప్రయాణంలో మీరే నా బలం… మీరే నా బలగం. ధర్మమే జయిస్తుంది.!
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
మిర్యాలగూడ, మార్చి 20 : ఈ నెల 24 నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామంలోని మహబూబ్అలీ ఫంక్షన్హాల్, 25న అడవిదేవులపల్లి మండలం సత్రశాలలో, ఈ నెల 26న వేములపల్లి మండల ఆత్మీయ సమ్మేళనం మిర్యాలగూడ టీఎన్ఆర్ గార్డెన్స్లో, 27న మిర్యాలగూడ మండల క్లస్టర్-1, 28న మండల క్టస్టర్-2, 29న మిర్యాలగూడ మండల క్లస్టర్-3 సమ్మేళనం స్థానిక టీఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన దామరచర్ల, ఏప్రిల్ 2న దామరచర్ల క్లస్టర్-2 సమ్మేళనం స్థానిక లక్ష్మారెడ్డి ఫంక్షన్హాల్లక్ష, 5న మిర్యాలగూడ పట్టణం క్లస్టర్-1, 6న మిర్యాలగూడ క్లస్టర్-2, 7న క్లస్టర్-3 కార్యకర్తల సమ్మేళనం టీఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.