బడీడు పిల్లలు బడిలో ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి 2024-25 విద్యా సంవత్సరంలో బడిలో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది.
ఈ నెల 11న ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన సర్వే జనవరి 10, 2024 వరకు కొనసాగనున్నది. ఇందుకోసం క్లస్టర్ రిసోర్స్పర్సన్లు (సీఆర్పీలు) ఆయా క్లస్టర్ కాంప్లెక్స్ పాఠశాలల పరిధిలో సర్వే పూర్తి చేసి వివరాలను ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ఎంత మంది బడీడు పిల్లలు బడి బయట ఉన్నారనేది తేలడంతోపాటు వారి చదువుకు భరోసా కలుగనున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 251 మంది సీఆర్పీలు సర్వేలో నిమగ్నమయ్యారు(నల్లగొండ 113, సూర్యాపేట 79, యాదాద్రి భువనగిరి 59). తల్లిదండ్రుల పని, పిల్లలు బడికి వెళ్లకపోవడానికి గల కారణాలు, ఎంత వరకు చదివి మానేశారనే అంశాలను పరిశీలిస్తారు. అదేవిధంగా సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా ఉంటే నిర్ధారణ చేయాల్సి ఉంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో వారి పిల్లలు మధ్యలోనే చదువు నిలిపేస్తున్నారు. ఈ క్రమంలో 6 నుంచి 14 ఏండ్లు, 15 నుంచి 19 ఏండ్లలోపు బడి బయటి పిల్లల వివరాలను సేకరిస్తారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల్లోపు బడీడు పిల్లలందరి వివరాలు పాఠశాలల్లో నమోదై ఉండాలి. డ్రాపౌట్స్ తగ్గించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే కాకుండా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ సర్వేను విద్యాశాఖ నిర్వహిస్తున్నది. సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించడమే కాకుండా వారి వివరాలను నిర్ణీత ఫార్మాట్లో నమోదు చేయాలి. పిల్లల వివరాలు పాఠశాలల్లో నమోదు లేని పక్షంలో వెంటనే ప్రధానోపాధ్యాయుల సమక్షంలో తక్షణమే నమోదు చేయించాలి. రోజువారీగా గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేయాలి.
అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో బడి బయట ఉన్న 6 నుంచి 14 ఏండ్ల పిల్లలను గుర్తించేందుకే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 71(నల్లగొండ 31, సూర్యాపేట 23, యాదాద్రి భువనగిరి 17)మండలాల ఎంఈఓలు, క్లాంప్లెక్స్ హెఎంలు, సీఆర్పీలు, డీఎల్ఎంటీలు, ఐఈఆర్టీలకు ఇప్పటికే అవగాహన శిక్షణను ఆయా జిల్లాల విద్యాశాఖల సమగ్ర శిక్ష ద్వారా అందించారు. అంతే కాకుండా సర్వే ఎలా నిర్వహించాలి? ఏ వివరాలు సేకరించాలి? అనే అంశంపై వారికి సూచనలు ఇచ్చారు. సర్వే సమయంలో ఆయా పాఠశాలల పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ సాయం తీసుకోనున్నారు. దాంతో సీఆర్సీలు జనవరి 10, 2024 వరకు సర్వే చేసి గుర్తించిన బడి బయటి పిల్లల వివరాలను ఎంఆర్సీలకు, అక్కడి నుంచి డీఈఓ కార్యాలయాలకు పంపించనున్నారు.
6 నుంచి 14, 15 నుంచి 19 సంవత్సరాలు గల బడి బయటి పిల్లల సర్వేకు సంబంధించి 14 అంశాల సమాచారంతో కూడిన ప్రొఫార్మాతో సీఆర్పీలు క్లాంప్లెక్స్(క్లస్టర్)వారీగా సర్వే చేస్తున్నారు. ప్రొఫార్మాలోని అంశాలపై అవగాహన పెంచుకుని సీఆర్పీలు సర్వేను పూర్తి చేయాల్సి ఉంది. జనవరి 10, 2024లోగా సర్వే పూర్తి చేసి ఈ వివరాలను ఎమ్మార్సీ కేంద్రాల ద్వారా జిల్లా విద్యాశాఖకు చేరవేయాల్సి ఉంది.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి సర్వే ప్రారంభమైంది. అయితే ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి పని కోసం జిల్లాకు వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించడం లేదని సర్వేలో తెలుస్తున్నది. వీరిలో 101 మంది గత ఏడాది బడిలో చేర్పించగా 376 మంది వివిధ రాష్ర్టాలకు తల్లిదండ్రులతోపాటు తిరిగివెళ్లారు. బడీడు పిల్లను గుర్తించేలా ముందస్తుగా చేపట్టిన సర్వేను సీఆర్పీలు ఆయా క్లస్టర్ల పరిధిలో పకడ్బందీగా చేపట్టాలి. పూర్తి వివరాలను ‘ప్రబంధ్ పోర్టల్’లో రోజువారీగా నమోదు చేయాలి. గుర్తించిన పిల్లందరినీ బడిలో చేర్పిస్తాం. అందరికీ విద్య అందాలన్న లక్ష్యంతోనే సర్వే చేపట్టి ముందుకు సాగుతున్నాం.
– భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
బడి బయట పిల్లలను గుర్తించడం కోసం నిర్వహిస్తున్న ఈ సర్వేను సీఆర్పీలు, ఐఈఆర్పీలు పకడ్బందీగా నిర్వహించాలి. సర్వే వివరాలను విద్యాశాఖ నిర్దేశించిన ఫార్మాట్లో సేకరించి వాటిని ప్రబంధ్ పోర్టర్లో నమోదు చేయాలి.అంతేకాక జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి నమోదు చేయాలి. రోజు వారీ సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత సీఆర్పీలదే.
-అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి, సూర్యాపేట