సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకకు కంటి వెలుగు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతున్నది. 18 సంవత్సరాలు నిండిన వారికి రానున్న కాలంలో కంటి సమస్య అన్నదే ఉండకూడదన్న దృఢ లక్ష్యంతో పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో విజయవంతానికి కృషి జరుగుతున్నది. ఈ నెల 18 నుంచి కార్యాచరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్న కంటి పరీక్ష మెషీన్లు, కళ్లద్దాలు, మందులు, ఇతర సామగ్రిని శనివారం సాయంత్రానికి పీహెచ్సీలకు చేరవేయనున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పొరపాట్లకు తావు లేకుండా విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి13(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 18న సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం అన్నిచోట్ల ప్రారంభించనున్నారు. అందుకోసం పూర్తిస్థాయిలో సన్నద్ధత జరుగుతుంది. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో పాటు నిత్యం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సమీక్షిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలిస్తున్నారు. ఎక్కడా ఇబ్బం ది లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చేసే దిశగా పకడ్బందీ చర్యలపై దృష్టి సారించారు. ఇక మరోవైపు కంటి వెలుగు కుఅవసరమైన సామగ్రిని చేరవేసే కార్యక్రమం కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 8 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేశారు. మొత్తం 34 పీహెచ్సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో పరీక్షల నిర్వహణ కోసం 74 బృందాలను ఏర్పా టు చేశారు. సూర్యాపేట జిల్లాలో 53 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్తో పాటు పారామెడికల్ అప్తాలమిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ కార్యకర్తల ను నియమించారు. వీరందరికీ ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. ఒక్కో బృందం రో జూ 120 మందికి పరీక్షలు చేయవచ్చని భావిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి కళ్లద్దాలు,మందులు అందజేయనున్నారు.
ఇక మరోవైపు కంటి వెలుగు నిర్వహణకు అవసరమైన సమస్త ఏర్పాట్లపైనా దృష్టి సారించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన యంత్ర పరికరాలు, మందులు తదితరాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరాయి. పరీక్షల్లో అవసరమైన వారికి కళ్లద్దాలను, మందులను పూర్తి ఉచితంగా ప్రభుత్వమే ఇస్తున్న విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు అవసరమైన కంటి పరీక్షలు చేసే రిఫ్రాక్టోమీటర్లు ఇప్పటికే వచ్చాయి. పాతవి 26 అందుబాటులో ఉండగా కొత్తగా 48 జిల్లాకు చేరాయి. తొలి దఫాగా 68వేల కళ్లద్దాలు కూడా జిల్లాకు చేరాయి. సూర్యాపేట జిల్లాకు 50 పరీక్షా మి షన్లు, 43,900 కళ్లద్దాలు ఇప్పటికే వచ్చా యి. వీటితో పాటు అవసరమైన మందులు కూడా వచ్చాయి. వీటన్నింటిని శనివారం సాయంత్రానికి క్షేత్రస్థాయిలో నిర్దేశించిన పీహెచ్సీలకు చేరవేయనున్నారు. శుక్రవారమే కొన్ని చోట్లకు వీటిని పంపించారు. ఈ నెల 16న నాటికి క్షేత్రస్థాయిలో పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్న లక్ష్యంతో చకచకా ఏర్పా ట్లు పూర్తి చేస్తున్నారు.
కంటివెలుగుపై ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మున్సిపాలిటీ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారులను, వైద్య సిబ్బందిని భాగస్వాములను చేయనున్నారు. త్వరలోనే గ్రామాల వారీగా కంటివెలుగు శిబిరాలు తేదీలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. మొత్తం వంద రోజు ల్లో అన్ని గ్రామాలు, వార్డులు కవర్ అయ్యేలా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఆధార్కార్డుతో వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించనున్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో కంటివెలుగు సక్సెస్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తు న్నాం. ఇప్పటికే జిల్లాకు వచ్చిన కళ్లద్దాలను, పరీక్షా మిషన్లు, మందులను పీహెచ్సీలకు చేరవేస్తున్నాం. శనివారం సాయంత్రానికి ఇది పూర్తవుతుంది. వైద్యబృందాల నియామకం పూర్తయ్యింది. ఈ నెల 18న ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అంతటా ఒకేసారి ప్రారంభ మవుతుంది. ప్రజలకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం.
-కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ.