యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరుల ప్రత్యేక పూజల కోలాహలం నెలకొం ది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదా ద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధనీ సమేత రామ లింగేశ్వరుడి పూజాదులు కొనసాగాయి. శివుడికి రుద్రాబిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు.
ప్రభాతవేళలో గంటన్నర పాటు శివుడ్ని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు, విభూతితో ఆలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్ర హ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయం ఉపప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.
యాదాద్రీశుడి నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల స్వామి వారి నిత్య కైంకర్యాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొని సామూహిక వ్రతాలచరించారు.