ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 24 : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే దృక్పథంతో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తూనే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
448 మంది విద్యార్థులు..
మండలంలో 12 ఉన్నత పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయం, ఆదర్శ పాఠశాల, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూల్స్లో మొత్తం 448 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 284 మంది బాలురు, 164 మంది బాలికలు ఉన్నారు.
ప్రత్యేక తరగతులు
డిసెంబర్ మొదటి వారం నుంచే ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నది. వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్, రోజువారి టెస్టులు విర్వహిస్తూ మెరుగైన స్థాయికి చేరేలా కృషి చేస్తున్నారు. జనవరిలో సజ్జెక్టుల వారీగా గ్రాండ్ టెస్టులు, స్లిప్ టెస్టులు, ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వార్షిక పరీక్షలకు విద్యార్థులు హాజరు కానున్నారు.
’గోరు ముద్ద’ కావాలి :
విద్యార్థులు ఉదయం పూట బడికి వచ్చి సాయం త్రం వరకు ఉండి చదువుకునేందుకు గానూ అల్పాహారం అందిస్తే మరింత ఉత్సాహంతో విద్యనభ్యసించే అవకాశం ఉన్నది. విద్యార్థులు మధ్యా హ్న భోజనం చేసి సాయంత్రం పొద్దుపోయే వరకు ఉండాలంటే నీరస పడిపోతారు. ఓ వైపు ఆకలి వేస్తుంటే మరో వైపు బోధనపై దృష్టి సారించడం పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థుల ఆకలి తీర్చే దిశగా గోరు ముద్ద కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్ధలు, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రావాలి.
సందేహాలను నివృత్తి చేస్తున్నారు
ఉదయాన్నే బడికి రావడంతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చక్కగా గుర్తుంటున్నాయి. ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. రోజు వారిగా ఉదయం, సాయంత్రం వేళలో సబ్జెక్టుల వారీగా చదివిస్తున్నారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల్లో సందేహాలుంటే ప్రత్యేక తరగతుల్లో నివృత్తి చేసుకుంటున్నాం.
-రావుల వైష్ణవి, పదో తరగతి, ఏపూర్
నూరు శాతం ఫలితాల కోసం
మండలంలో 448 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. పాఠశాలల వారిగా ఇప్పటికే టైం టేబుల్ ఇచ్చాం. అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి వారిని ప్రోత్సహిస్తున్నాం. గ్రామాల వారిగా దాతలు ముందుకు వచ్చి గోరు ముద్దకు సాయం అందించాలి.
– ధారాసింగ్, మండల విద్యాధికారి, ఆత్మకూర్ ఎస్