సూర్యాపేట, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : పెద్ద గట్టు జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు కలుగకుండా మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. గుట్ట చుట్టూ దాదాపు 800 మీటర్ల పరిధిలో ప్రతి రెండు వందల మీటర్లకు ఒక ట్యాంకు, సంపు, తాగునీటి నల్లాలు ఏర్పాటు చేశారు. ఈ సారి కోనేటిని కూడా మిషన్ భగీరథ నీటితో నింపడం గమనార్హం.
ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే దురాజ్పల్లి లింగమంతుల జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు. అయితే గత పాలకులు జాతర ఏర్పాట్ల కోసం నయా పైసా వెచ్చించక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు వచ్చే వారంతా తమ ఇండ్ల నుంచి బిందెల్లో నీటిని తెచ్చుకునే వారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్వరాష్ట్రంలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేయడంతో ప్రజల ఇబ్బందులు తీరాయి. ప్రస్తుతం గుట్ట పరిసరాల్లోని 800ల మీటర్ల పరిధిలో ఎటు చూసినా నల్లాలు, ట్యాంకులు కనిపిస్తున్నాయి. గుట్ట చుట్టూ 18 ప్రాంతాల్లో తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశారు. భక్తులు వంటలు వండుకోవడంతో పాటు ఇతర అవసరాల నిమిత్తం 12 మినీ ట్యాంకులు నిర్మించారు. వీటిని స్వచ్ఛమైన మిషన్భగీరథ నీటితో నింపుతున్నారు. దాంతో భక్తులకు తాగునీటి ఇక్కట్లు తీరాయి. వీటితో పాటు గుట్ట చుట్టూ నిర్మించిన మరుగుదొడ్లకు కూడా 24 గంటల పాటు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.