యాదగిరిగుట్ట, ఏప్రిల్ 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. సోమవారం ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు నిర్వహించారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు.
నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు జరిపించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠమూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు జరిగాయి. అనుబంధ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.25,16,248 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ఘనంగా రామానుజాచార్య తిరునక్షత్రోత్సవం
స్వామివారి సన్నిధిలో రామానుజాచార్య తిరునక్షత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు ప్రధానాలయ ముఖ మండపంలో ఆళ్వారులను, లక్ష్మీనరసింహస్వామిని దివ్య మనోహరంగా అలంకరించి సేవోత్సవం నిర్వహించారు. అలాగే రాజాపేట మండలం పాముకుంటకు చెందిన సురభి గోశాల, హనుమాన్ ఆలయం నిర్వాహకులు రూ.5వేల విలువైన గ్రీన్ కార్పెట్ను సోమవారం ఆలయానికి అందజేశారు. భక్తులు ఎండ వేడిమికి తట్టుకునేలా ఆలయ తిరు మాఢవీధుల్లో గ్రీన్ కార్పెట్ను వేశారు.