సూర్యాపేట సిటీ, నవంబర్ 29 : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మొత్తం 3,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో నిబంధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు.
జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉన్నందున బయట ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా చేరవద్దని సూచించారు. మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటరు కాని వారు గ్రామాలు, వార్డుల్లో ఉండకూడదన్నారు. వెంట పోల్ చిట్టి, గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఓటు వేశాక ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలని, అసత్యాలు ప్రచారం చేయవద్దని, పార్టీ జెండాలు, ప్లకార్ట్స్ వెంట తీసుకురావద్దన్నారు. ఇతరులను కించపరిచేలా, రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద ఆర్ముడ్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగభూషణం, ఆర్ఐ నారాయణరాజు, భద్రతా సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారు.